ఉస్మానియా యూనివర్సిటీ : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా నిర్వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ సమక్షంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకున్నప్పటికీ, వాళ్లెవరూ గొడవను ఆపేందుకు ప్రయత్నించక పోవడం గమనార్హం. ఈ సమావేశాన్ని తార్నాక డివిజన్ లాలాపేటలోని నఫీజ్ గార్డెన్లో సోమవారం రాత్రి నిర్వహించారు.
ఈ సమావేశానికి గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కూడా హాజరుకాకపోవడంపై పలువురు వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత్ కమిటీల అంశంలో మెట్టుగూడ డివిజన్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. మరోవైపు వేదికపై నాయకులు నిండిపోయినప్పటికీ, వేదిక కింద కుర్చీలు ఖాళీగా కనిపించడం విశేషం.
వేదిక ఫుల్, కార్యకర్తలు నిల్ అని పలువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు ఆదం సంతోష్కుమార్, మాజీ కార్పొరేటర్ ఆదం ఉమాదేవి, దీపక్జాన్, సురేశ్లాల్ తదితరులు పాల్గొన్నారు.