మణికొండ : మణికొండ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లపై నూతన కమిషనర్గా భాధ్యతలు చేపట్టిన ఫల్గుణ్ కుమార్ చర్యలకు ఉపక్రమించారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఇప్పటికే సర్కారు చర్యలు తీసుకుని విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
ఇదిలావుండగా గతంలో మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించిన జయంత్కుమార్ లాగిన్ పాస్వర్డ్ ను దొంగ తనంగా వినియోగించి ఖాళీ స్థలాలకు, అనుమతి లేని ఇళ్లకు అసెన్మెంట్లు జరిగినట్లుగా అక్రమదారిలో అనుమతులు జారీచేసి ఇంటి నెంబర్లు కేటాయించారంటూ ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అక్రమాలతో పాటు ఉన్నతాధికారుల లాగిన్ పాస్వర్డ్లను సైతం చాకచక్యంతో దొంగతనం చేసి లక్షలాది రూపాయాలను సొమ్ముచేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో శనివారం నలుగురు బిల్కలెక్టర్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశాల మేరకు మణికొండ మున్సిపల్ కమిషనర్ ఫల్గుణ్కుమార్ విధుల నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
నెక్నాంపూర్ పరిధిలో మున్సిపల్ బిల్కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న జె.లక్ష్మారెడ్డి, పి.గోపాల్ నాయక్, పి.వరలక్ష్మీ, ఆర్. విజయ్కుమార్లతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు నిఖిల, రేఖలను వారి విధుల నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
వీరితో పాటు మరికొంత మంది బిల్కలెక్టర్లపై విచారణ కొనసాగుతుందని వారిపై తుది విచారణలో అవినీతి రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలో గత కొంతకాలంగా ఒకేచోట పాతుకుపోయిన బిల్కలెక్టర్ల ను త్వరలోనే మార్చుతామన్నారు. అక్రమాలకు పాల్పడితే ఇకపై కఠినమైన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.