జగిత్యాల మెడికల్ కాలేజీ పనులు వేగవంతం
రూ.11.5 కోట్లతో శరవేగంగా తాత్కాలిక భవన నిర్మాణం, మరమ్మతులు
మాతా శిశు కేంద్రం వినియోగానికి చర్యలు
ఇప్పటికే 16 విభాగాల్లో 1001 పోస్టులు మంజూరు
బోధనా సిబ్బంది రిక్రూట్మెంట్కు కసరత్తు
వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు
పర్యవేక్షిస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్
జగిత్యాల, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ):జగిత్యాల మెడికల్ కాలేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర సర్కారు రూ.11.5 కోట్లు మంజూరు చేయగా, కాలేజీతోపాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కళాశాల నిర్మాణాలు, మరమ్మతులు స్పీడందుకున్నాయి. పట్టణ నడిబొడ్డున 27 ఎకరాల స్థలంతోపాటు తాత్కాలిక భవనాలు, మాతాశిశు కేంద్రం ఉండడంతో వాటిని వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 16 విభాగాల్లో ప్రభుత్వం 1001 పోస్టులు మంజూరు చేయగా, రిక్రూట్మెంట్కు రంగం సిద్ధమైంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తొలిబ్యాచ్ను ప్రారంభించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.
జగిత్యాల జిల్లా కేంద్రానికి మంజూరైన మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా నిర్వహించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో జగిత్యాల మెడికల్ కాలేజీలో తొలి బ్యాచ్కు బోధన ప్రారంభించడంతోపాటు అనుబంధ హాస్పిటల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 17న మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ ప్రకటించి, క్యాబినెట్ ఆమోదంతో మంజూరు చేసినప్పటి నుంచి కాలేజీ, హాస్పిటల్ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
జెట్ స్పీడ్తో పనులు
జూన్ 25న రాష్ట్ర ఆర్థిక శాఖ జగిత్యాల మెడికల్ కాలేజీకి పూర్థిస్థాయిలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 34 విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులతో పాటు, ప్రిన్సిపాల్ పోస్టును, హాస్పిటల్కు సూపరింటెండెంట్ పోస్టును మంజూరు చేసింది. వీటితో పాటు అనేక సహాయక సిబ్బంది పోస్టులను మంజూరు చేసింది. మెడికల్ కాలేజీ, హాస్పిటల్కు సంయుక్తంగా 1001 బోధన, బోధనేతర, సిబ్బంది పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పనులు జెట్ స్పీడ్తో సాగుతున్నాయి.
తాత్కాలిక భవనాల్లో ప్రారంభానికి నిర్ణయం..
జగిత్యాల పట్టణ నడిబొడ్డున 27 ఎకరాల స్థలం, తాత్కాలిక నిర్మాణాలు ఉండడంతో వాటిని వినియోగించుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచే వైద్య కాలేజీ, హాస్పిటల్ సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ప్రభుత్వానికి, రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్కు విన్నవించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 27 ఎకరాల స్థలాన్ని గుర్తించిన కలెక్టర్, ఆ స్థలంలో గతంలో నిర్మించి ప్రస్తుతం వినియోగానికి యోగ్యమయ్యే నిర్మాణాలు ఉన్నాయని, ఇటీవలే నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్ర భవనాన్ని కళాశాలకు వినియోగించుకోవచ్చని సూచిస్తూ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు, ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6వ తేదీన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్, ఓఎస్డీ తదితరుల బృందం జగిత్యాలలో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని విషయాలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా మెడికల్ కాలేజీతో పాటు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే వైద్యశాల కలిపి ప్రారంభించనున్నామని ప్రకటించారు. ఇప్పటికే నిర్మించి ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని వినియోగించుకుంటామన్నారు. అలాగే కొన్ని భవనాలను సైతం పరిశీలించి, వాటిని వినియోగించుకుంటూ వైద్య కళాశాల, హాస్పిటల్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే ఏడాది 150 మంది వైద్య విద్యార్థులు ఇక్కడ చదివేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. బృందం పర్యటించిన తర్వాత తాత్కాలిక భవనాల నిర్మాణాలు, మరమ్మత్తుల కోసం రూ. 11.5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 250 పడకల సామర్థ్యం కలిగిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని 350 పడకల సామర్థ్యానికి పెంచేందుకు నిర్ణయించారు. ఈమేరకు భవనంపై మరో అంతస్తును నిర్మిస్తున్నారు. అలాగే బోధన, సమావేశాలు, వైద్యుల చాంబర్ల కోసం పక్కనే ఉన్న నిర్మాణాల్లో మార్పులు చేస్తున్నారు.
బోధనా సిబ్బంది రిక్రూట్మెంట్ మొదలు
జగిత్యాలతోపాటు మంజూరు చేసిన మరో ఆరు మెడికల్ కాలేజీల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెండు నెలల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది. మెడికల్ కాలేజీలో 34 విభాగాల్లో ఫ్రొఫెసర్ పోస్టులతో పాటు, అసోసియేట్ ఫ్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. డిసెంబర్ చివరి కల్లా ఫ్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి, జనవరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను, కీలకమైన సాంకేతిక నిపుణుల పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్లో నీట్ పరీక్షల తర్వాత జగిత్యాలలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి, ఇందులో 150 సీట్లను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మెడికల్ కాలేజీపై వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష..
మెడికల్ కాలేజీకి సంబంధించిన పనులపై వారం క్రితం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగిత్యాల మెడికల్ కాలేజీ ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకోవాలని, తాత్కాలిక భవనాలను, ఇతర నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి, డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. డిసెంబర్లో కేంద్ర మెడికల్ కౌన్సిల్ బృందం జగిత్యాల మెడికల్ కాలేజీ తాత్కాలిక భవనాలను, ఇతర సౌకర్యాలను పరిశీలించేందుకు వస్తుందని, అప్పటిలోగా అన్ని పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర బృందం పరిశీలించి అనుమతిని మంజూరు చేస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధన, వైద్యం ప్రారంభించేందుకు అవకాశాలుంటాయని, సిబ్బంది త్వరగా పనులు పూర్తి చేసేలా చూడాలని మంత్రి ఆదేశించారు.
ఒకేసారి కాలేజీ, అనుబంధ వైద్యశాల సేవలు
జగిత్యాల మెడికల్ కాలేజీ దేశంలోనే మోడల్ మెడికల్ కాలేజీగా మారుతుంది. సీఎం కేసీఆర్ జగిత్యాలకు మెడికల్ కాలేజీ ఇస్తామని ప్రకటించి మంజూరు చేశారు. శరవేగంగా పనులు చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే స్థలాన్ని గుర్తించి, వైద్య,ఆరోగ్య శాఖకు అందించాం. మాతా శిశు సంరక్షణ భవనంతో పాటు, ఇతర నిర్మాణాలను ఆలంబనగా చేసుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. పోస్టులు మంజూరయ్యాయి. రిక్రూట్మెంట్ మొదలైంది. రూ.11.5 కోట్లతో తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేస్తున్నాం. సహజంగా మెడికల్ కాలేజీ, దాని అనుబంధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరైన తర్వాత ఐదారేండ్లకు ప్రారంభమవుతాయి. అందుకు భిన్నంగా దేశంలో తొలిసారిగా మెడికల్ కాలేజీ, దాని అనుబంధ వైద్యశాల ఒకేసారి జగిత్యాలలో సేవలు అందించబోతున్నాయి. సకల వసతులు, రవాణా మార్గాలు, అన్ని వనరులతో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీ దేశంలోనే మోడల్ మెడికల్ కాలేజీ అవుతుంది. కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు, అందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రత్యేక ధన్యవాదాలు.