మన్సూరాబాద్ : టైలరింగ్ షాపు నడుపుతున్న ఓ మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు అపహరించుకుపోయాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.
ఏపీ, విజయనగరం జిల్లా, నెలిమర్లకు చెందిన రాధ (46) ప్రస్తుతం మన్సూరాబాద్, సౌత్ఎండ్ పార్కు కాలనీ రోడ్డునెం. 18లో టైలరింగ్ షాపు నడుపుతుంది. సోమవారం రాత్రి 7:43 గంటల సమయంలో టైలర్ షాపులో రాధ ఒంటరిగా ఉండటాన్ని నడుచుకుంటూ అటువైపుగా వచ్చిన ఓ యువకుడు (సుమారు 22-24 సంవత్సరాలు) గమనించాడు.
షాపు వద్దకు వెళ్లి ఏదో అడ్రస్సు విషయమై మాట్లాడుతూ సదరు మహిళ మెడలోనుంచి సుమారు 4 తులాల పుస్తెల తాడును అపహరించుకుని పారి పోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాలనీలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
దుండగుడు హిమపురికాలనీ వైపు నుంచి నడుచుకుంటూ సౌత్ఎండ్ పార్కు కాలనీలోకి వచ్చినట్లు గుర్తించారు. మహిళ మెడలో నుంచి పుస్తెల తాడును అపహరించుకుని వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు వెంబడించినప్పటికీ దుండ గుడు వీకర్సెక్షన్కాలనీ మీదుగా పారిపోయినట్లు తెలియవచ్చింది.