సుల్తాన్బజార్ : ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 45 అడుగుల ఎకో ఫ్రెండ్లీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని శ్రీ నవ దుర్గా నవరాత్రి ఉత్సవ సమితి ఛైర్మన్, తెలంగాణ గంగపుత్ర ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఛైర్మన్ గులాబ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇసామియా బజార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా అతి పెద్ద దుర్గా మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ ఏడాది శ్రీ చక్ర విశ్వరూపిణి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ విగ్రహాన్ని 35 రోజులుగా 22 మంది కళాకారులు నిర్విరామంగా తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ విగ్రహ తయారీలో కలకత్తా నుండి తీసుకు వచ్చిన రెడ్ సి సాండ్, గడ్డిని, కట్టెలను ఉపయోగించనున్నారు.