వారం రోజుల్లోపు ఎగుమతులను పూర్తి
వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్
వైరా, మే 30: ప్రస్తుత యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులెవరూ అధైర్యపడవద్దని స్పష్టం చేశారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల సొసైటీ చైర్మన్లు, అధికారులతో ఎమ్మెల్యే ఆదివారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏయే మండలాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది? ఎగుమతి చేయాల్సి ఉంది? అనే అంశాలను సొసైటీ చైర్మన్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాసంగిలో ధాన్యం అధిక దిగుబడి రావడంతో మిల్లర్లు దిగుమతిలో తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నారు. వైరా, కొణిజర్ల మండలాల్లో రైతులు ధాన్యం ఎగుమతి చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి సమస్యను మంత్రి అజయ్, కలెక్టర్ కర్ణన్తో చర్చించామన్నారు. మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, సొసైటీ చైర్మన్లు శెట్టుపల్లి వెంకటేశ్వరరావు, చెరుకుమల్లి రవి, దుగ్గినేని శ్రీనివాసరావు, అయిలూరి కృష్ణారెడ్డి, గాలి శ్రీనివాసరావు, సొసైటీ అధికారులు పాల్గొన్నారు.