దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో రాణించాలి
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
సీఎం కేసీఆర్ చొరవతో పదెకరాల్లో రూ.10 కోట్లతో భవనం
ఎమ్మెల్సీ మల్లేశం
నారాయణఖేడ్, జనవరి 30 : కురుమల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూకల్ శివారులో రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గే మల్లేశంతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 238 బీసీ గురుకుల పాఠశాలలను గొల్లకురుమలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కురుమలు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందిపుచ్చుకుని అన్నిరంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. నారాయణఖేడ్లో కురుమల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ మల్లేశంతో కలిసి నిధులు సమకూర్చడంతోపాటు అనువైన స్థలాన్ని సైతం కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తామన్నారు.
కురుమలు రాజకీయంగా ఎదగాలి..
కురుమలు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గే మల్లేశం అన్నారు. సీఎం కేసీఆర్కు కురుమలపై ఉన్న గౌరవంతో హైదరాబాద్లో 10 ఎకరాల స్థలంలో సంఘం భవనం నిర్మించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. పేద విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఈ భవనాన్ని వినియోగించే దిశగా యోచిస్తున్నామన్నారు. కురుమలు అన్నిరంగాల్లో ఎదిగేందుకు అవసరమైన రీతిలో తాను కృషి చేస్తానన్నారు. నారాయణఖేడ్లో సంఘం భవనం కోసం ఎమ్మెల్యే భూపాల్రెడ్డి స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారని, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను తాను.. ఎమ్మెల్యేతో కలిసి సమకూరుస్తామన్నారు. కురుమల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు. అంతకుముందు పట్టణంలోని కరస్గుత్తి రోడ్డు నుంచి దొడ్డి కొమురయ్య విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించడంతోపాటు డొలుదెబ్బ కళాకారుల ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు బురుగడ్డ నగేశ్, దొడ్డి కొమురయ్య వారసులు దొడ్డి చంద్రం, దొడ్డి మల్లయ్య పాల్గొన్నారు.