పరారీలో మరో నిందితుడు
గంజాయి విలువ రూ.60లక్షలు
రవాణా, సాగు చేస్తే పీడీ యాక్టులు
సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్
సంగారెడ్డి, నవంబర్ 29 : గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుట్టురట్టు చేశారు. సోమవారం ఉద యం 6 గంటలకు సంగారెడ్డి పోలీసులకు అందిన సమాచారం మేరకు కంది చౌరస్తాలో తనిఖీ చేపట్టగా గంజాయి తరలిస్తున్న లారీ పట్టుబడింది. సోమవారం సంగారెడ్డి రూరల్ పీఎస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ రమణకుమార్ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వస్తున్న లారీని పోలీసులు తనిఖీ చేసినట్లు తెలిపారు. పాత ఇనుప స్క్రాప్ కింద అడుగు భాగంలో ప్లాస్టిక్ సంచుల్లో తరలిస్తున్న గంజాయిని (600కిలోల ఎండు గంజాయి దాదాపు రూ.60లక్షల విలువ ఉంటుంది) పోలీసులు గుర్తించారన్నారు. డైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రూరల్ స్టేషన్కు లారీతో సహా తరలించారన్నారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఎండు గంజాయిని తూర్పు గోదావరి జిల్లా నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని పండరీపూర్కు రవాణా చేస్తున్నట్లు పోలీసులకు చిక్కిన వ్యక్తులు తెలిపారన్నారు. ఇందుకు మూల కారకుడైన అనిల్రెడ్డి పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో పట్టుకుంటామన్నారు. డ్రైవర్ గణేశ్ నందకిశోర్ పోట్దార్, మాలెగావ్ గ్రామం, నీలంగా తాలుకాకు చెందిన వ్యాపారి అనిల గోవింద్ కలిముక్లెను అరెస్ట్ చేసి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్లు తెలిపారు. నర్సీపట్నం నుంచి పాత ఇనుప స్క్రాప్ లోడ్తో వచ్చే లారీలో గంజాయి రవాణా చేయవచ్చని జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతవాసి ఎనక్పల్లికి చెందిన అనిల్రెడ్డి డబ్బుల ఆశచూపి లారీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని ఒప్పించాడన్నారు. గంజాయిని మహారాష్ట్రలోని పండరీపూర్కు చేరవేస్తే రూ.50 వేలు ఇస్తాననే ఒప్పందంతో లారీ డ్రైవర్, మరో వ్యక్తి రవాణా చేసేందుకు ఒప్పుకుని మార్గమధ్యలో కంది చౌరస్తాలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారని ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ నితికపంత్, డీఎస్పీ బాలాజీ నాయక్, రూరల్ ఇన్స్పెక్టర్ శివలింగం, కంది తహసీల్దార్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.