వడ్లు కొనమని చెబుతున్న కేంద్రం
చేసేదేమీలేక వరి సాగు వద్దంటున్న రాష్ట్ర సర్కార్
ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచన
పేట జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న రైతులు
ఒక్క రైతును చూసి 115 ఎకరాల్లో కంది సాగు
లాభాలు రావడంతో ఆరుతడి దిశగా పయనం..
మహబూబ్నగర్ నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనేది లేదని తెగేసి చెబుతున్నది. రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా లాభం లేకపోవడంతో గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు చేయొద్దని కోరుతున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు పండించాలని సూచిస్తున్నది. ఇప్పటికే పలువురు రైతులు ఆరుతడి పంటలతో లాభాలు ఆర్జిస్తున్నారు. వారిని చూసి ఇంకొందరు అదే బాటలో పయనిస్తున్నారు. అధికారుల సూచనలతో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచలింగాలలో రైతు భీమిరెడ్డి గతేడాది కంది సాగు చేసి లాభాలు గడించాడు. ఆయన్ని చూసి సుమారు 40 మంది రైతులు 115 ఎకరాల్లో కందులు పండించారు. మక్తల్ మండలంలోని చాలా గ్రామాల రైతులకు భీమిరెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వరి వద్దు.. ఆరుతడి ముద్దు అని రైతులు చెబుతున్నారు. ఎకరా వరి సాగు చేస్తే పెట్టుబడి పోనూ రూ.11 వేలు మాత్రమే వస్తుందని.. కందులు పండిస్తే రూ.36 వేల వరకు ఆదాయం వస్తుందంటున్నారు.
కేంద్రం యాసంగిలో వడ్లు కొనేది లేదని తెగేసి చెబుతున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు శ్రేయస్సు కోసం అనేకమార్లు కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించింది. వారిలో ఏమాత్రం చలనం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వరి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేయాలని సూచిస్తున్నది. ఇప్పటికే పలువురు రైతులు ఆరుతడి పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచలింగాలలో భీమిరెడ్డి అనే రైతు చేసిన ప్రయత్నం ఆ గ్రామంలోని మిగతా రైతులను మార్చేసింది. చిన్న గోప్లాపూర్లో లక్ష్మణ్ అనే మరో రైతు ఆరుతడి పంటల దిశగా ప్రయత్నాలు చేసి ఆయన కూడా కందులు సాగు చేశారు. మంచి లాభాలు వచ్చాయి. అది గమనించిన మిగతా రైతులు ఆ రైతు బాటనే పట్టారు. సుమారు 100 ఎకరాలకు పైగా కందిసాగు చేస్తున్నారు. భవిష్యత్లోనూ అధికారుల సలహాలు, సూచనలతో పంట మార్పిడి చేస్తామని చెబుతున్నారు. భీమిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని మిగతా రైతులు సుమారు 40మంది 115ఎకరాల్లో అదే రకం కందులు సాగు చేశారు. రుద్రసముద్రంలో రఘువర్ధన్రెడ్డి అనే రైతు కుటుంబం 43ఎకరాల్లో కందిపంట సాగు చేశారు. మంచి లాభాలు వచ్చాయి.
వరికి, కందులకు తేడా ఇదీ..
వ్యవసాయాధికారుల అంచనా మేరకు.. ఎకరా పొలంలో వరి సాగు చేస్తే పెట్టుబడి సుమారు రూ.30వేలు అవుతుంది. 22క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. వడ్లు విక్రయిస్తే రూ.40వేల వరకు వస్తుంది. పెట్టుబడి రూ.30వేలు పోతే వచ్చే ఆదాయం రూ.11వేలు మాత్రమే. అదే ఎకరా పొలంలో కందులు వేస్తే.. పెట్టుబడి రూ.20వేలు అవుతుంది. దిగుబడి సుమారుగా 7 క్వింటాళ్లు వస్తుంది. క్వింటాకు రూ.8వేల చొప్పున రూ.56వేలు లభిస్తాయి. పెట్టుబడి రూ.20వేలు పోనూ ఆదాయం రూ.36వేల వరకు వస్తుంది. రెండు పంటల కాలపరిమితి నాలుగు నెలలు. వరి వల్ల ఆదాయం రూ.11వేలు వస్తే.. కందుల వల్ల మూడు రెట్లు అధికంగా రూ.36వేల వరకు వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. వరి వేస్తే కొనే పరిస్థితి లేదు. ప్రస్తుతం కందుల సీజన్ ముగిసింది. కానీ ఆరుతడిలో ఒక్క కందులే కాకుండా మినుములు, ఆవాలు, జీలకర్ర తదితర పంటలతోపాటు అన్ని రకాల కూరగాయలు, పొద్దుతిరుగుడు సాగుచేయొచ్చని, వరి వెంట పరుగులు పెట్టి నష్టపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఆరుతడి పంటల్లోనే ఆదాయం
వరి వల్ల లాభాలు లేవు. అందుకే ప్రభుత్వం కూడా మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనే పరిస్థితి లేదు. యాసంగిలో ఉష్ణోగ్రతల మార్పుల వల్ల బియ్యంలో నూక ఎక్కువగా వస్తుంది. కాబట్టే మనం పారాబాయిల్డ్ వైపు వెళ్తాం. కానీ కేంద్రం కొనమని చెప్తున్నది. అందుకే తప్పనిసరిగా ఆరుతడి పంటలు వేసుకునాలి. ప్రస్తుతం కందుల సీజన్ అయిపోయింది. కాబట్టి మినుములు, ఆవాలు, జీలకర్ర, పొద్దుతిరుగుడు, కూరగాయల పండించాలి. ఆరుతడి పంటల వల్లే అధిక లాభాలు వస్తాయి. ఆరుతడి పంటల విషయంలో రైతులు ఏ అనుమానం ఉన్నా సమీపంలోని ఏఈవో, ఏవో లేదా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు.