కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
గద్వాల/గద్వాలరూరల్, నవంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సోమవారం గద్వాల మండలంలోని ముల్కలపల్లి, అనంతపూర్, బాస్రాచెరువు, బీరోలు, లత్తిపురం, పూడురు, తెలుగోనిపల్లి, వీరాపురం, ఎర్రవల్లి తదితర గ్రామాల్లో 22మంది లబ్ధిదారుల ఇంటింటికీ ఎమ్మెల్యే వెళ్లి నేరుగా కల్యాణలక్ష్మి చెక్కులు వారి కుటుంబసభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్దన్నలా ఆడపిల్ల పెండ్ల్లికి కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద లక్షా నూట పదహరు రూపాయలు అందజేస్తున్నారన్నారు. మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు భారంగా భావించే వారని, వారి పెండ్లిళ్ల్లు చేయడానికి అప్పుల పాలయ్యేవారన్నారు. అయితే వారి కష్టాలు గ్రహించిన సీఎం ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఆలోచనతో కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో సీఎం సహకారంతో ప్రతి గ్రామంలో మధ్యతరగతి వారు శుభకార్యాలు చేసుకోవడానికి కల్యాణ మండపాలు, షాదీఖానలు త్వరలో నిర్మిస్తున్నామన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే పేదలు శుభకార్యాలు, వివాహ వేడుకలు అందులో నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఆడపిల్లల కోసం అనేక సంక్షేమ ఫథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు అందరూ అండగా ఉండాలన్నారు.
పేదల ఆరోగ్యానికి భరోసా
పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండలం లోని బీరెల్లి,అనంతపురం గ్రామాల్లో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పంపిణీ చేశారు. బిచ్చమ్మకు రూ.లక్ష , జగన్కు రూ.75వేలు, ఈదన్నకు రూ.70,800, మీనాక్షికి రూ,33వేల విలువైన చెక్కులను సీఎం సహాయనిధి నుంచి మంజూరు కాగా ఎమ్మెల్యే బండ్ల స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీవైస్ చైర్పర్సన్ సరోజమ్మ, ఎంపీపీ ప్రతాప్గౌడ్,పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ సంజీవులు, జములమ్మ ఆల య చైర్మన్ సతీశ్కుమార్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, కౌన్సిలర్లు నాగిరెడ్డి, దౌలు, మండల, పట్ట ణ పార్టీ అధ్యక్షులు రాముడు, గోవింద్ సర్పంచులు మణె మ్మ, గీత, జయమ్మ, జయరామిరెడ్డి, రమేశ్ నాయుడు,నీలేశ్వర్రెడ్డి, నర్సింహారెడ్డి, నాయకులు రమేశ్నాయుడు, వెంకట్రామిరెడ్డి, చక్రధర్, జయరామిరెడ్డి, కురుమన్న, రామకృష్ణ, తాసిల్దార్ లక్ష్మి, ఆర్ఐ దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.