ఆలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తీక దీపాలను వెలిగించిన మహిళలు
అలంపూర్/ఇటిక్యాల/అయిజ/మల్దకల్/మానవపాడు నవంబర్ 29: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో కార్తీకశోభ సంతరించుకున్నది.అలంపూర్లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. భక్తులు ముందుగా తుంగభద్రా నదిలో స్నానమాచరించి ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగించారు. బాలబ్రహ్మేశ్వరాలయంలో అభిషేకాలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాగే బీచుపల్లి క్షేత్రంలో కార్తీక సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్బంగా కృష్ణానదిలో స్నానమాచరించిన అనంతరం భక్తులు పుష్కరఘాట్ వద్ద శివాలయం, కోదండరామాలయం, లక్ష్మీ హయగ్రీవ సమేత జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం, ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అయిజ పట్టణంలోని భ్రమరాంబిక, గుంత రామలింగేశ్వరస్వామి ఆలయంలో పరమశివుడికి పుష్పాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం పరమశివుడికి అభిషేకం, అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7 గంటలకు పరమశివుడికి వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల శివ నామస్మరణల నడుమ పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం భ్రమరాంబిక, గుంతరామలింగేశ్వరస్వామి పల్లకీలో ఆలయ ప్రాంగణంలో విహరించి భక్తులను కటాక్షించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆల యం, శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, చైర్మన్, ఈవో, భక్తుల ఆధ్వర్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు మొత్తం దీపాలు వెలిగించారు. అలాగే మానవపాడు మండల కేంద్రంలోని పాత శివాలయం, చెన్నిపాడు, అ మరవాయి, బోరవెల్లి, జల్లాపురం, పెద్దాందాలపాడు, పల్లెపాడు గ్రామా ల్లో భక్తులు తెల్లవారు జాము నుంచే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు.