బుగ్గ రామలింగేశ్వరస్వామి, అనంతగిరి జాతర్లకు పోటెత్తిన భక్త జనం
ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్న భక్తులు
ఆలయాల సన్నిధానంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు
కార్తిక దీపాలు వెలిగించిన మహిళలు
దుకాణాల వద్ద కిటకిటలాడిన జనం
ఆలయాల పరిసరాల్లో సందడే.. సందడి
కుటుంబ సమేతంగా వచ్చి సహపంక్తి భోజనాలు
మంచాల నవంబర్ 28 : కార్తిక మాసం సందర్భంగా బుగ్గ రామలింగేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్న భక్తులతో ఎటు చూసినా ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసాయి. బుగ్గ దేవాలయం శివనామస్మరణతో మార్మోగింది. ఆదివారం యాభై వేల మంది భక్తులకు పైగా స్వామివారినిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా గుండంలో స్నానమాచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి సన్నిధానంలో సత్యనారాయణస్వామి వ్రతాలతోపాటు తులసి కోట, శివలింగం వద్ద కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమీపంలో ఉన్న కబీర్దాస్ మందిరంలోని నాగన్న పుట్ట, నర్సింహబాబా సమాధితో పాటు కబీర్దాస్ మందిరంలో పూజలు నిర్వహించారు. దేవాలయానికి వెళ్లే రోడ్డుకు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్రెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. మంచాల సీఐ వెంకటేశ్గౌడ్, ఎస్సైలు సురేశ్, రామన్ గౌడ్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వంద మంది పోలీసులతోపాటు 15 సీసీ కెమెరాల నడుమ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.