ఇంటింటికీ కూరగాయల సాగు
చుట్టుపక్కల సంతకు తరలింపు
ప్రతి రోజు అదనపు ఆదాయం
కొల్చారం, నవంబర్ 28: తాజా కూరగాయలకు కేరాఫ్ అడ్రస్ వసురాంతండాగా మారింది. ఏ కాలమైనా కూరగాయలు దొరకాలంటే మండల పరిధిలోని వసురాంతండాలో కూరగాయలకు పెట్టింది పేరు. గ్రామంలో 80 కుటుంబాలు ప్రతి ఒక్కరూ తమకున్న భూమిలో అర ఎకరం కూరగాయలు సాగు చేస్తారు. గోరుచిక్కుడు, పుంటి కూర(గోంగూర), బెండ, దోస, పెద్ద చిక్కుడు తదితర కూరగాయలు సాగు చేసి అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. శీతాకాలం వచ్చిందంటే ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పాలకూర, బచ్చలికూర, కొత్తిమీర, మెంతికూరతో పాటు టమాట, వంకాయ వంటి కూరగాయలు సాగు చేసి కొల్చారం, పోతంశెట్పల్లి,చిన్నఘనాపూర్,కౌడిపల్లి గ్రామాల్లో జరిగే వారాంతపు సంతలో అమ్ముతారు. దీంతో వారికి అదనపు ఆదాయం రావడంతో పిల్లల చదువులు, వ్యవసాయంలో కూలీలకు డబ్బులు తదితర ఖర్చులకు సరిపోతాయని తెలిపారు.
కూరగాయల సాగుపై దృష్టి
తండావాసులు వానకాలం వరిపంట వేయకుం డా మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలు సా గు చేస్తుంటారు. అందులో బెండ, పుంటి కూర(గోంగూర), గోరుచిక్కుడు, పెద్ద చిక్కుడు, దోస వంటి కూరగాయల విత్తనాలు వేసి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకుని ఆదాయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. యాసంగిలో ప్రతి ఇంటికి అర ఎక రం సాగు చేసుకుని నిత్యం కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకోవడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు.
చాలా కాలం నుంచి సాగు చేస్తున్నాం..
తండాలో చాలాకాలం నుంచి ప్రతి ఒక్కరూ కూరగాయలు సాగు చేస్తున్నాం. ప్రతి ఇంటికి అర ఎకరం కూరగాయలు సాగు చేయడంతో మంచి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీపై విత్తనాలు వస్తున్నాయి. స్ప్రే పంపులు సబ్సిడీపై ఇవ్వడం వల్ల కూరగాయలకు రోగాలు రాకుండా స్ప్రే చేయడంతో అధిక దిగబడులు వస్తున్నాయి.
-మోతీ,వసురాం తండా సర్పంచ్