సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): సశక్తి నారీ సమ్మాన్ అవార్డు బంజారా మహిళా ఆర్గనైజేషన్ను వరించింది. సామాజిక సేవలో విరివిగా పాల్గొనే వారికి ఈ అవార్డును అందజేస్తారు. శనివారం మెంటర్ అండ్ మస్కట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సశక్తి నారీ సమ్మాన్ అవార్డును హైదరాబాద్కు చెందిన బంజారా మహిళా ఎన్జీవో చైర్మన్ సుజాత, వ్యవస్థాపకుడు డాక్టర్ ఆనంద్ కుమార్కు ప్రదానం చేశారు. వీరితో పాటు స్వరూప పొట్లపల్లి, ఝాన్సీ, హర్షిత, పరిమళలకు ఈ అవార్డులు అందజేశారు. బంజారా మహిళా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత ఏడేండ్లుగా అనాథ, వృద్ధాశ్రమాలు, వలస కూలీలు, నిరుపేదలకు, దివ్యాంగులతో పాటు కొవిడ్ కాలంలో ఎంతో మందిని ఆదుకున్నందుకు ఈ అవార్డు వరించిందని డాక్టర్ ఆనంద్ కుమార్ చెప్పారు.