సెప్టిక్ట్యాంక్లో చిక్కుకొనిఇద్దరు కార్మికుల మృతి
మరో ఇద్దరికి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు
కన్నీరుమున్నీరైన మృతుల కుటుంబీకులు
కొండాపూర్ గౌతమి ఎన్క్లేవ్లో ఘటన
శేరిలింగంపల్లి/సైదాబాద్, నవంబర్ 28 : సెప్టిక్ట్యాంక్ను శుభ్రం చేసేందుకు వచ్చిన ఇద్దరు కూలీలు మృత్యువాతపడ్డారు. ట్యాంక్లో వ్యర్థాలు తొలగించేందుకు లోపలికి దిగగా, విషవాయువులతో ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక అందులోనే ప్రాణాలు విడిచారు. వీరినికాపాడేందుకు యత్నించిన మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇంటి పెద్దలు విగతజీవులు కావడంతో కుటుంబసభ్యులు మమ్ముల్ని చూసెదెవరంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన ఆదివారం ఉదయం కొండాపూర్లోని గౌతమి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో జరిగింది.
కొండాపూర్ గౌతమి ఎన్క్లేవ్లో విషాదం చోటుచేసుకున్నది. అపార్టుమెంట్ సెప్టిక్ట్యాంక్ క్లీనింగ్ కోసం వచ్చిన కార్మికులు డ్రైనేజీ సంపులోకి దిగారు. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతిచెందారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న మాదాపూర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు కార్మికులను దవాఖానకు తరలించారు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..
అంతా సింగరేణి కాలనీ వారే..!
నల్గొండ జిల్లా, కొండపల్లి మండలం, మంజతండా గ్రామానికి చెందిన నానవత్ శ్రీను(38) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి సైదాబాద్ సింగరేణి కాలనీ ఆదర్శ్నగర్లో భార్య సుజాత, కూతురు మౌనిక, కొడుకులు చరణ్, సిద్దులతో కలిసి నివసిస్తున్నాడు. రోజువారీ కూలీ పనులతో పాటు ఆటో డ్రైవర్గా, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తుంటాడు. నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట్ మండలం, అక్కారం గ్రామానికి చెందిన ఉలగొండ అంజయ్య అలియాస్ అంజి(32) నగరానికి వలసవచ్చి రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ భార్య పద్మ, కొడుకు అభిరాంతో కలిసి సైదాబాద్ సింగరేణి కాలనీ ఆదర్శ్నగర్లో నివాసముంటున్నాడు. కాగా అదే కాలనీకి చెందిన సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనం యజమాని స్వామి అదే వాహనంపై డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే కాలనీవాసి జాని సదరు వాహనానికి క్లీనర్గా పనిచేస్తున్నాడు.
శ్రీనును రక్షించబోయి.. అంజిసైతం..!
సెప్టింట్ ట్యాంక్ క్లీనింగ్ చేసే పనులను వాహన యజమాని స్వామి ఒప్పుకున్నాడు. ఆదివారం ఉదయం 8 గంటలకు అతడి వెంట క్లీనర్ జానీతో పాటు శ్రీను, అంజిలను తీసుకొని కొండాపూర్ గౌతమి ఎన్క్లేవ్ కాలనీలోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్టుమెంట్ (ప్లాన్ నంబర్.64, జీ+5) వచ్చారు. ముందుగా గంటసేపు సెప్టిక్ట్యాంక్లో నిండిపోయిన డ్రైనేజీ నీటిని తొలగించారు. తర్వాత కార్మికులు శ్రీను, అంజి డ్రైనేజీ వ్యర్థాలను తొలగించేందుకు సంపులోకి దిగారు. మొదట సంపులో డ్రైనేజీ వ్యర్థాలు తొలగించే క్రమంలో విషవాయువులు వెలువడి నానవత్ శ్రీను ప్రమాదవశాత్తు ఊపిరాడక కప్పకూలిపోయాడు. అతడిని కాపాడేక్రమంలో అంజి సైతం మృతిచెందాడు. వీరిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్, క్లీనర్ సైతం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
9:30 గంటలకు ఫిర్యాదు..
అపార్టుమెంట్ వాసుల ఫిర్యాదుతో 9:30 గంటల సమయంలో హుటాహుటిన అక్కడకు చేరుకున్న మాదాపూర్ ఫైర్ అధికారులు, గచ్చిబౌలి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర అస్వస్థతకు గురైన స్వామి, జానీని సమీపంలోని కొండాపూర్ ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. సంపులో వ్యర్థాల నడుమ చిక్కుకుని ఊపిరాడక మృతిచెందిన శ్రీను, స్వామి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
మిన్నంటిన రోదనలు
మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సంఘటన స్థలికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలు అక్కడినుంచి తరలించరాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టి ఇద్దరి మృతికి కారణమైన సెప్టిక్ట్యాంక్ యజమానిపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.