ఖైరతాబాద్, నవంబర్ 28 : అతి వేగం ప్రమాదానికి దారి తీసింది. సాగర్లోకి ఓ కారు దూసుకుపోయింది. ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీకి చెందిన సాత్విక్, ఖైరతాబాద్కు చెందిన కార్తీక్, నితిన్ స్నేహితులు. వీరందరూ ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు. ఆదివారం స్నేహితులతో కలిసి టిఫిన్ చేసేందుకు సాత్విక్ కారులో ఖైరతాబాద్కు వచ్చాడు. అయితే కారు నడిపే బాధ్యతను నితిన్ తీసుకొని అఫ్జల్గంజ్కు బయలుదేరారు. రోటరీ చౌరస్తా మీదుగా వేగంగా నడుపుతూ ముందుకు వెళ్తుండగా, ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న మలుపు వద్ద అదుపు తప్పింది. సాగర్కు ఉన్న గ్రిల్స్ను చేధించుకొని నీటిలో పడిపోయింది. వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ.. కారు నడుపుతున్న నితిన్ చేతిలో ఇనుప చువ్వ దిగి తీవ్ర గాయమైంది. మిగతా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారాన్ని పోలీసులకు అందించగా, సంఘటన స్థలానికి చేరుకొని కారులో ఉన్న వారందరినీ బయటకు తీసి.. దవాఖానకు తరలించారు. నితిన్ చెప్పు ఎక్సలేటర్లో ఇరకడం వల్లే వాహనం వేగం పెరిగి అదుపు తప్పినట్లు పోలీసుల విచారణలో స్నేహితులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.