నిండుకుండలా తుంగభద్ర డ్యాం
39ఏండ్ల తర్వాత పెద్ద ఎత్తున స్టోరేజీ
యాసంగిలో పుష్కలంగా ఆర్డీఎస్కు నీరు
21వేల ఎకరాల్లో ఆరుతడి పంటల సాగు
అయిజ, డిసెంబర్ 27 : కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర నిండుకుండను తలపిస్తున్న ది. దీంతో మూడు రాష్ర్టాల ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. టీబీ డ్యాం సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నది. 39 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా యాసంగి పంట సమయంలో 97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ఏడాది టీ బీ డ్యాంలో నీటి నిల్వలు భారీగా ఉండడంతో తెలంగాణ రా ష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లా, ఏపీలోని అనంతపురం, కర్నూల్, కడప జిల్లాలతోపాటు కర్ణాటక ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందుతుందని రైతులు ఆశాభా వం వ్యక్తం చేస్తున్నారు. టీబీ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1631.94 అడుగులు ఉన్నది. 100.855 టీఎంసీల నీటి సామర్థ్యానికిగానూ 96.786 టీఎంసీలు నిల్వ ఉన్నది. వర్షాలు తగ్గినా.. వాగులు, వంకల ద్వారా డ్యాంలోకి 2,864 క్యూసెక్కులు చేరుతున్నది. కాల్వలకు 6,982 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో టీబీ డ్యాంలో 1624.85 అడుగుల నీటి మట్టంతో 72.439 టీఎంసీలు ఉన్నాయి 1949లో తుం గభద్ర జలాశయాన్ని 8,035 చదరపు అడుగులతో నిర్మాణం చేపట్టారు. 1953లో నిర్మాణం పూర్తి చేసుకొని మూడు రాష్ర్టాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టుతోపాటు వేలాది గ్రామాల్లో దాహార్తిని తీరుస్తున్నది.
తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వల ఆధారంగా ఆర్డీఎస్ ఆయకట్టుకు నీటి కేటాయింపులు జరిపారు. ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టుకు 6.150 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకున్నది. వానకాలంలో వరద జలాలను మాత్రమే వినియోగించుకొని పంటల సాగు చేపట్టారు. యాసంగిలో ఆర్డీఎస్ ఆయకట్టు కింద ఆరుతడి పంటలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 21 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అవసరమైన మేరకు టీబీ డ్యాం ద్వారా నీటిని విడుదల చేసి రైతులు పండించేలా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రణాళిక రూపొందించాం..
ఈ ఏడాది యాసంగిలో ఆర్డీఎస్ ఆయకట్టు కింద ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్డీఎస్ నీటి వాటా కింద 6.150 టీఎంసీలను డ్యాం ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉన్నది. అందుకనుగుణంగా పంటలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం డ్యాం పరిసరాల నుంచి 3 వేల క్యూసెక్కులకు పైగా నీరు ఆర్డీఎస్కు చేరుతున్నది. వచ్చే నెల నుంచి ఆర్డీఎస్ ఇండెంట్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.