గ్రామంలోని 80 శాతానికి పైగా రైతుల సాగు
డిమాండ్ ఉండటంతో పెరిగిన సాగు విస్తీర్ణం
తాండూరు రూరల్, నవంబర్ 27 : ఉల్లిగడ్డ సాగులో మండలంలోని మిట్టబాసుపల్లి ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలోని 80 శాతానికి పైగా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. మార్కెట్లో ఉల్లిగడ్డకు డిమాండ్ పెరుగడంతో గతేడాది కంటే ఈ ఏటా సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. ప్రభుత్వం ప్రతి ఏడాది అందిస్తున్న రైతు బంధు పెట్టుబడి సాయంతోనే ఈ పంటను సాగు చేస్తున్నట్లు మిట్టబాసుపల్లివాసులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్ కూడా తమకు ఎంతో దోహదపడుతున్నదని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఉల్లిగడ్డ క్వింటాల్కు రూ. 4000ల నుంచి రూ.5000ల వరకు ధర పలుకుతున్నది. ఇప్పటికే కొంతమంది రైతులు ముం దుగానే ఉల్లిని సాగు చేశారు. మరో రెండు నెలల్లో పంట చేతికి వస్తుందని రైతులు పేర్కొంటున్నా రు. రబీ సీజన్లో ఉల్లిగడ్డ నాట్లు వేస్తారు. సబ్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం సుమారు వెయ్యి ఎకరాల్లో ఉల్లిగడ్డ పంట సాగవుతుండగా, మండలంలోని మిట్టబాసుపల్లి గ్రామంలోనే ఆరు వందల ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేస్తారంటే అతిశయోక్తి కాదు. బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండలాలకంటే తాండూరు మండలంలోనే ఈ పంట సాగుకు రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
బషీరాబాద్ మండలంలోని ఇందర్చెడ్, కాశీంపూర్, గొట్టుగకాలన్, మంతటి గ్రామాల్లో దాదాపుగా వంద ఎకరాల్లో ఈ పంట సాగువుతున్నది. అదేవిధంగా యాలాల మండల కేంద్రంతోపాటు అచ్యుతాపూర్, అగ్గపూర్, బాగాయిపల్లి, విశ్వనాథ్పూర్ గ్రామాల్లో 150 ఎకరాల్లో, పెద్దేముల్ మండలంలో గోపాల్పూర్, బుద్దారం, మారేపల్లి, నాగుపల్లి గ్రామాల్లో సుమారు 150 ఎకరాల్లో, తాండూరు మండలంలో అల్లాపూర్, జినుగుర్తి, ఐనెల్లి, ఉద్దండాపూర్, సంకిరెడ్డిపల్లి, గుంతబాసుపల్లి, పర్వతాపూర్, వీరారెడ్డిపల్లి, రాంపూర్ గ్రామాల్లోని రైతులు ఉల్లి పంటను సాగు చేస్తుండగా మండలంలోని మిట్టబాసుపల్లి గ్రామంలోనే సుమారు ఆరు వందల ఎకరాల్లో ఈ పంటను రైతులు సాగు చేస్తుండటం విశేషం. మార్కెట్లో ఉల్లిగడ్డకు డిమాండ్ పెరుగడంతో ఈ ఏటా గతేడాది కంటే పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా ఉల్లిగడ్డ సాగుకు పెట్టుబడి ఎక్కువగానే అవుతున్న దని రైతులు పేర్కొంటున్నారు. ఎకరం పంట సాగుకు రూ.30వేల వరకు ఖర్చు అవుతున్నదని, అంతేకాకుండా పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని లారీల్లో హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేట మార్కెట్కు తరలించేందుకు కూడా అధికంగా ఖర్చులు అవుతున్నాయని వారు పేర్కొన్నారు.
ధరలు స్థిరంగా ఉండాలి
పంట చేతికొచ్చి మార్కెట్లో విక్రయించేటప్పుడు కొన్నిసార్లు ధరలు పడిపోతున్నాయని రైతులు
వాపోతున్నారు. గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులకు లారీల కిరాయి కూడా చెల్లించలేని పరిస్థితులున్నాయన్నారు. మార్కెట్లో ఉల్లిగడ్డ ధరలు స్థిరంగా ఉంటే వ్యాపారులు, వినియోగదారులకు బాగుంటుందని పేర్కొంటున్నారు.