జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి
మైసమ్మతల్లి ఆలయ అభివృద్ధిపై రివ్యూ మీటింగ్
పాల్గొన్న అధికారులు, నిర్వాహకులు, స్థానికులు
కడ్తాల్, నవంబర్ 27 : రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. శనివారం మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన వివిధ పనులకు సంబంధించి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులతో ఆలయ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ ధర్మాదాయ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఆర్డీవో వీరాచారి, తహసీల్దార్ మహేందర్రెడ్డి, సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్గౌడ్, ఆలయ ట్రస్టీ శిరోలీ పంతూనాయక్, సర్పంచ్ తులసీరాంనాయక్ హాజరయ్యారు. సమావేశంలో ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల వివరాలను ఆలయ అధికారులు, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
నివేదికలు తయారుచేయాలి
ఆలయ రాజగోపుర నిర్మాణం, ముఖద్వారం, షాపింగ్ కాంప్లెక్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కు, భక్తులకు వసతి గృహాలు, పార్కింగ్ తదితర సమస్యలపై నివేదికలు తయారు చేయాలని ఆచారి అధికారులకు సూచించారు. ఇటీవల కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డిని కలిసి మైసిగండి ఆలయాన్ని అభివృద్ధిపరచాలని కోరామన్నారు. మైసిగండి ఆలయంతోపాటు ఆంధ్రప్రదేశ్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాన్ని ప్రసాద యోజన స్కీం కింద చేర్చి, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాల్సిందిగా విన్నవించినట్లు పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి సంబంధించి డిసెంబర్ 13న ఢిల్లీలో మంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో వివరించనున్నట్లు తెలిపారు.
15 రోజుల్లో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం
మైసమ్మ ఆలయం పర్యాటక కేంద్రంగా ఏర్పడితే ఈ ప్రాంతంలోని అయ్యసాగర క్షేత్రం, అయ్యప్ప కొండలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రంలో జోగులాంబ ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, మైసిగండి మైసమ్మతల్లి ఆలయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం జాతీయ రహదారుల శాఖ అధికారి బీరేంద్రసింగ్ రూ.4.60 కోట్లు మంజూరు చేశారని, పదిహేను రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు. అంతకుముందు మైసమ్మ ఆలయంలో ఆచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మహేశ్వరం తహసీల్దార్ జ్యోతి, ఆలయ నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, నాయకులు వీరయ్య, రెడ్యానాయక్, మహేశ్, అశోక్, మన్యానాయక్, సాయిలాల్, శంకర్నాయక్, వెంకటేశ్ పాల్గొన్నారు.