గంజాయి నివారణకు పటిష్టమైన చర్యలు
నేర సమీక్ష సమావేశంలో భద్రాద్రి ఎస్పీ
కొత్తగూడెం క్రైం, నవంబర్ 26: ఇటీవల వివిధ కోణాల్లో కొత్తరూపు దాల్చుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టే విధంగా ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని భద్రాద్రి ఎస్పీ సునీల్దత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో అన్ని సబ్ డివిజన్ల పోలీసు అధికారులతో శుక్రవారం నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సైబర్ నేరాలు కొత్త రూపు దాల్చుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడి నగదును కోల్పోతే 155260 నంబరుకు గానీ, 7901145673 నంబరుకు గానీ వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
అదే విధంగా గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపి దాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా ప్రతి అధికారి కృషి చేయాలని ఆదేశించారు. గంజాయి రవాణాదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఆర్ఎంఎస్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే పోలీస్ అధికారులు, సిబ్బంది సెలవులు, ఇతర అర్జీలు చేసుకుంటే సులభంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు ‘నేను సైతం’ ద్వారా అవగాహన కల్పించి వారిని భాగస్వాములను చేయాలన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ ధూళిపాల శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ (అడ్మిన్) కేఆర్కే ప్రసాద్, ఏఎస్పీలు శబరీశ్, వినీత్, రోహిత్ రాజు, డీఎస్పీలు వెంకటేశ్వర బాబు, రవీందర్రెడ్డి, పీఆర్వో దాములూరి శ్రీనివాసరావు, సీఐలు, ఐటీ సెల్ అధికారులు పాల్గొన్నారు.