ఐడీఏ పాశమైలారంలో తయారీ యూనిట్
పాత డబ్బాల్లో బ్రాండెడ్ ఉత్పత్తులుగా అమ్మకాలు
పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో దాడులు
అదుపులో ఇద్దరు నిర్వాహకులు.. పరారీలో మరొకరు
పటాన్చెరు, జనవరి 25 : బ్రాండెడ్ కంపెనీల పేరిట నకిలీ పాల ఉత్పత్తుల గుట్టును పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి బృందం రట్టు చేసింది. భారీ ఎత్తున వివిధ బ్రాండ్ల పాల ఉత్పత్తుల డబ్బాలు, బ్రాండెడ్ పాల ఉత్పత్తుల డబ్బాల్లో తయారు చేసిన పెరుగు, పన్నీరును స్వాధీనం చేసుకొని, యూనిట్కు తాళం వేసింది. ఇద్దరు నిర్వాహకులు పోలీసులకు చిక్కగా, మరొకరు పరారీలో ఉన్నాడు. డీఎస్పీ భీంరెడ్డి వివరాల ప్రకారం.. గతంలో పాల డెయిరీ ఉత్పత్తుల వ్యాపారంలో నష్టపోయిన రవీందర్(55), పరమేశ్వర్(35), వెంకటేశ్వరరావు కలిసి, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఏడాదిన్నరగా పవిత్ర అనే డెయిరీని నిర్వహిస్తున్నారు. అందులో మహేంద్ర డెయిరీ, విశాఖ తదితర పేర్లతో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. డీఎస్పీ భీంరెడ్డి పక్క సమాచారం మేరకు ఆ పరిశ్రమపై సిబ్బందితో కలిసి దాడి చేసిన సమయంలో పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అక్కడున్న రవీందర్, పరమేశ్వర్ ప్రశ్నించగా, పరిశ్రమలో నకిలీ బ్రాండ్లతో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. పోలీసుల సోదాల్లో పాతడబ్బాలను కడిగి తిరిగి వాడుతున్న విషయం కనిపించింది. అముల్, హెరిటేజ్, జెర్సీ, ఎన్ఎస్ఎల్, నందిని వంటి ప్రముఖ బ్రాండెడ్ ఉత్పత్తుల నకిలీ డబ్బాలను పోలీసులు గుర్తించారు. పైగా వారు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పాలను వివిధ రూపాల్లో కల్తీ చేసి రెట్టింపు చేసుకుంటున్నారు. వివిధ బ్రాండ్లకు నకిలీ పాల ప్యాకెట్లు, పది, ఐదు కేజీల పెరుగు డబ్బాలు, పన్నీరు డబ్బాలు లభించాయి. గోదాంలో వేలాది పాత డబ్బాలు దర్శనమిచ్చాయి. నకిలీ ఉత్పత్తులను తయారు చేయడాన్ని పర్యవేక్షిస్తున్న రవీందర్, పరమేశ్వర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరువేల లీటర్ల పాల ఉత్పత్తులను సీజ్ చేశారు. వెంకటేశ్వర్రావు పరారీలో ఉన్నాడు. బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో పటాన్చెరు, బీడీఎల్ పోలీసులు పాల్గొన్నారు.