భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 23 : అర్హులైన వారికి సకాలంలో రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని కలెక్టర్ పమేలాసత్పతి బ్యాంక్ ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ, దీర్ఘకాలిక రుణాల కింద రూ.47.83 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.11.50 కోట్లు అందించినట్లు చెప్పారు. రూ.83.50 కోట్ల పంట రుణాలకు రూ.59.13 కోట్ల అందించి 71శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. సూక్ష్మ రుణ ప్రగతిలో రూ.14.66 కోట్లకు గాను 3009 మంది లబ్ధిదారులకు రూ.9.82 కోట్లు(67శాతం) విద్యా రుణాలకింద రూ.21.82 కోట్లకు గాను ఇప్పటి వరకు 116 మందికి రూ.7.13 కోట్లు అందించినట్లు తెలిపారు. వీధి వ్యాపారులకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 8637 మందికి రూ.10వేల చొప్పున రుణాలు అందించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 13,136 మహిళా సంఘాలకు గాను 5,664 గ్రూపులకు రూ.21.91 కోట్లు (61శాతం) అందించినట్లు చెప్పారు. కొత్తగా వచ్చిన పరిశ్రమలకూ రుణాలు అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సకాలంలో రుణాలు గ్రౌండింగ్ చేయాలన్నారు. అనంతరం నాబార్డ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆర్బీఐ ఎల్డీఓ పూర్ణిమ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ, కెనరాబ్యాంక్ డీఎం శ్రీనివాస్, ఎస్బీఐ డీఎం రఘోత్తమరావు, నాబార్డ్ మేనేజర్ సత్యనారాయణ, సంక్షేమ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రతిభ కనబర్చిన వారికి సర్టిఫికెట్లు
భువనగిరి అర్బన్ : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన మహిళలు, విద్యార్థులకు కలెక్టర్ పమేలా సత్పతి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.పూర్ణచందర్, యువజన క్రీడల జిల్లా అధికారి కె.ధనుంజనేయులు, డీఈఓ సంజీవ కమిటీ సభ్యులు దిడ్డి బాలాజీ, జయశ్రీ, అంజయ్య, పాల్గొన్నారు.