మూడు సెట్ల నామినేషన్లు దాఖలు
మంత్రి జగదీశ్రెడ్డి, ముఖ్య నేతల హాజరు
పోటీకి దూరంగా ప్రధాన పార్టీలు
స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో మరో 10 మంది
నేడు నామినేషన్ల పరిశీలన
ఎల్లుండి వరకు ఉపసంహరణకు గడువు
పెద్దఎత్తున తరలివచ్చిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యులు
కోటిరెడ్డి ఎన్నిక లాంఛనమే : మంత్రి జగదీశ్రెడ్డి
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాతో కూడిన స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. సోమవారం నాటికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా, చివరి రోజు మంగళవారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంకెన కోటిరెడ్డి, మరో 10 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన విపక్షాలు పోటీకి దూరంగా ఉన్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం కేసీఆర్ కోటిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో.. ఆయన తరఫున మూడు సెట్ల నామినేషన్లు వేశారు. కార్యక్రమానికి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వం వహించగా, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు ఉన్న బలం నేపథ్యంలో కోటిరెడ్డి ఎన్నిక లాంఛనమేనని ప్రకటించారు. కాగా, టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహంతోపాటు ఎన్నికల జోష్ మొదలైంది. బుధవారం నామినేషన్ల పరిశీలన, ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని రిటర్నింగ్
అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం నల్లగొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం సందడిగా మారింది. ఈ నెల 16నుంచి నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉన్నా… సోమవారం వరకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ మంగళవారం అందరూ ఒకేసారి నామినేషన్ల దాఖలుకు సిద్ధపడ్డారు. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మంకెన కోటిరెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ మేరకు పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే అధినేతగా కేసీఆర్ పార్టీ శ్రేణుల అభిమానాన్ని చూరగొన్నైట్లెంది. పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం నామినేషన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, ప్రభుత్వవిప్ గొంగిడి సునీతా, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులంతా నల్లగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి వచ్చిన అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ల సమావేశంలో కోటిరెడ్డికి పార్టీ తరపున బీఫామ్ను మంత్రి జగదీశ్రెడ్డి అందించారు. పార్టీ అభ్యర్థి కోటిరెడ్డి తరఫున మొత్తం మూడు సెట్ల నామినేషన్లను టీఆర్ఎస్ నేతలు దాఖలు చేశారు. తొలి సెట్ను మంత్రి జగదీశ్రెడ్డి, సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి అభ్యర్థి కోటిరెడ్డి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు అందజేశారు. అనంతరం రెండో సెట్ను ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ సునీత, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక దాఖలు చేశారు. మూడో సెట్ను ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
10మంది స్వతంత్ర అభ్యర్థులు…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో 10మంది స్వతంత్రులు నామినేషన్ వేశారు. వారిలో కాసర్ల వెంకటేశ్వర్లు, (గుమ్మడవెల్లి) కొండమల్లేపల్లి, రాంసింగ్ కొర్రా, (మైనంపల్లి)దేవరకొండ, బెజ్జం సైదులు, (దిలావర్పూర్)దామరచర్ల, బడుగుల రవీందర్, (భీమారం)కేతేపల్లి, పాదూరి గోవర్ధిని, (మొల్కపట్నం)వేములపల్లి, తండు సైదులు, (బాబాసాహెబ్గూడెం)నకిరేకల్, ఏర్పుల శ్రీశైలం, (లెంకలపల్లి)మర్రిగూడెం, కుడుదుల నగేశ్, (రాఘవాపురం)ఆలేరు, వంగూరి లక్ష్మయ్య, (గుండ్లపల్లి)నల్లగొండ, దాచేపల్లి నాగేశ్వర్రావు,(చీకటిగూడెం)కేతేపల్లి ఉన్నారు. కుడుదుల నగేశ్, వంగూరి లక్ష్మయ్య(జడ్పీటీసీలు), బడుగుల రవీందర్, కాసర్ల వెంకటేశ్వర్లు, బెజ్జం సైదులు, ఏర్పుల శ్రీశైలం (ఎంపీటీసీలు) కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. కొర్రా రాంసింగ్, దాచేపల్లి నాగేశ్వర్రావు సతీమణులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు. తండు సైదులు కాంగ్రెస్, పాదూరి గోవర్ధిని సీపీఎం ఎంపీటీసీ.