‘మన ఊరు-మన బడి’తో విద్యార్థులకు మంచి రోజులు
పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలో రెండు పాఠశాలలు ఎంపిక
వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1-10 తరగతులకు ఆంగ్ల బోధన
ఇప్పటికే పలు పాఠశాలల్లో అమలు
రంగారెడ్డి, జనవరి 22, (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందనున్నది. వచ్చే మూడేండ్లలో స్కూళ్ల దశ మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం రూ.7,289 కోట్లు వెచ్చించి మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించింది. డిజిటల్ తరగతులు, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నిచర్, మరమ్మతులు, అవసరమైన చోట కొత్త భవనాలు, వంటగదికి షెడ్లు తదితర సౌకర్యాలు కల్పించనునున్నది. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10 తరగతుల వరకు ఇంగ్లిష్ మీడియాన్ని అమలులోకి తేనున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన జరుగుతుండగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో అమలు చేయనున్నారు. మొదటి ఏడాది అత్యధిక విద్యార్థుల సంఖ్య ఉన్న 35 శాతం స్కూళ్లలో సదుపాయాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు.
ఆది నుంచీ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రానున్నా యి. వాటితో వచ్చే మూడేండ్లలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించనున్నారు. అయితే ముందుగా అధికంగా విద్యార్థులు ఉ న్న పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి, తర్వాత మిగతా బడుల్లో వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వసతుల కల్పనలో భాగంగా నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నిచర్, పాఠశాలలకు రంగులు, పాఠశాల భవనాలకు మరమ్మతులు, చాక్బోర్డులు, ప్రహరీలు, వంటగది షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. దీంతో ఏడాదిలోనే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని కూడా అమల్లోకి తీసుకురానున్నది. వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలుచేయనున్నారు.
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు
పరిగి, జనవరి 22: చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించే బడులను బాగు చేయడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం తాజాగా మన ఊరు – మ న బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.7,289 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించనున్నారు.
వికారాబాద్ జిల్లాలో మొత్తం 1,084 పాఠశాలలుండగా వాటిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 170, ప్రాథమిక పాఠశాలలు 712, యూపీఎస్లు 173 , కేజీబీవీలు 18, మోడల్ స్కూల్లు 9, సాంఘిక సం క్షేమ గురుకుల పాఠశాలలు 2 ఉన్నాయి. వీటిలో సుమారు లక్షా 10వేల పైచిలుకు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 35శాతం పాఠశాల ల్లో ఈ ఏడాది మౌలిక వసతులను కల్పించేందుకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 12 అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించనున్నారు. అన్ని పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీ లు, డిజిటల్ తరగతుల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పించడం, రంగులు వేయడం, మరమ్మతులు, తాగునీరు, విద్యుత్ తదితర సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ చేసిన విద్యార్థులు, పాఠశాలల స్థితిగతుల ఆధారంగా చేపట్టే పనుల అంచనాలు తయారు చేసి, జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన తర్వాత పనులను చేపట్టనున్నారు. అదేవిధంగా వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలుచేయనున్నారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం పేద విద్యార్థులకు వరం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు బడులను బలోపేతం చేసేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తామంటూ కేబినెట్లో తీర్మానం చేయడం పేద విద్యార్థులకు వరంలాంటిది. ప్రభుత్వ పాఠశాలల్లో చదు వుతున్న వారంతా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ పిల్లలే. వారిని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తే వేలాది రూపాయల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలైతే ఉచితంగా విద్యా బోధన అందే అవకాశం ఉంది. – అబ్దుల్ హక్, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొడంగల్