రెండు రోజుల్లో 1,12,623 ఇండ్ల సర్వే
జ్వర సర్వేల్లో పాల్గొన్న పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డి
ముమ్మరంగా కొనసాగుతున్న జ్వర సర్వే
మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం
రెండో రోజు రంగారెడ్డి జిల్లాలో 40,738 ఇండ్లు, వికారాబాద్ జిల్లాలో 34,981 ఇండ్ల సర్వే
జ్వరం, జలుబు వంటి లక్షణాలున్నవారి గుర్తింపు
కొవిడ్ లక్షణాలున్న వారికి ఉచితంగా కిట్స్ అందజేత
హోం ఐసొలేషన్లో ఉన్నవారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా
కరోనాపై అవగాహన కల్పిస్తున్న వైద్యబృందం
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, జనవరి 22 : కరోనా వైరస్ను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ఉమ్మడి జిల్లా వైద్య బృందం చకచకా చర్యలు తీసుకుంటున్నది. ఒకవైపు ఇంటింటి జ్వర సర్వేను ముమ్మరం చేస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నది. జ్వర సర్వేలో భాగంగా రెండో రోజు శనివారం రంగారెడ్డి జిల్లాలో 40,738 ఇండ్ల సర్వే చేయగా, వికారాబాద్ జిల్లాలో 34,981 ఇండ్ల సర్వేను పూర్తి చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలున్నవారిని గుర్తించి మందుల కిట్లను అందజేశారు. హోం ఐసొలేషన్లో ఉన్నవారి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. ఎలాంటి భయాందోళన చెందకుండా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సర్వే తీరును అధికారులు పర్యవేక్షించారు.
కొవిడ్ వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే రెండో రోజుకు చేరింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా రెండు రోజుల్లో 1,12,623 ఇండ్ల సర్వేను వైద్య ఆరోగ్య బృందాలు పూర్తి చేశాయి. అధికంగా జలుబు, ఒళ్లునొప్పులు, జ్వరం లక్షణాలున్నవారే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారికి మందులు అందజేసినట్లు తెలిపారు. లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే హోంఐసొలేషన్లో ఉంచుతూ ప్రతిరోజూ వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 678 బృందాలు సర్వే
రంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు 10600, రెండో రోజు 40738 ఇండ్ల సర్వే నిర్వహించారు. శనివారం నిర్వహించిన సర్వేలో దగ్గు, జలుబు ఉన్నవారికి ఉచితంగా మందుల కిట్లను వైద్యారోగ్య శాఖ బృందాలు అందజేశాయి. జిల్లావ్యాప్తంగా 678 బృందాలను ఫీవర్ సర్వే చేపడుతుండగా, వీటిలో గ్రామీణ ప్రాంతంలో 558, అర్బన్ ప్రాంతంలో 120 బృందాలు ఇంటింటికీ వెళ్ల ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందం రోజుకు గ్రామీణ ప్రాంతంలో 30 ఇండ్లు, అర్బన్ ప్రాంతంలో 50 ఇండ్ల చొప్పున సర్వే చేపట్టింది.
ఇంటింటి సర్వేతో కరోనా కట్టడి
వికారాబాద్ జిల్లా పరిధిలో రెండో రోజు 34981 ఇండ్ల సర్వేను చేపట్టారు. జిల్లాలో 220301 కుటుంబాలుండగా 741 ప్రత్యేక బృందాలు సర్వే చేపడుతున్నాయి. రెండు రోజుల్లో 61285 కుటుంబాల సర్వేను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలతో కూడిన బృందాలు గ్రామాల్లో, ఎన్ఎంలు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, మున్సిపల్ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు. అలాగే 15 నుంచి 17 ఏండ్లు నిండినవారు మొదటి డోసు, 18 ఏండ్లు పైబడినవారిలో రెండో డోసు, 60 ఏండ్లు పైబడిన వారు ప్రికాషనరీ డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటివద్దే వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇంటింటి సర్వేతో ఎక్కడికక్కడే కరోనా కట్టడి సాధ్యమవుతుందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లా పరిధిలోని పరిగి పట్టణంలోని 2, 6 వార్డుల్లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, తాండూరు పట్టణంలోని 4వ వార్డులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి జ్వర సర్వేలో పాల్గొని వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్వర లక్షణాలున్న వారికి ఎమ్మెల్యేలు మందులు అందజేశారు. శనివారం జిల్లాలో 15 నుంచి 17 ఏండ్లు నిండినవారు 260 మందికి, 18 ఏండ్ల పైబడినవారిలో మొదటి డోసు 163 మందికి, రెండో డోసు 3830 మందికి, ప్రికాషనరీ డోసు వ్యాక్సిన్ 212 మందికి వేశారు.