ఖమ్మం సీపీ విష్ణు, భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్
ఉమ్మడి జిల్లాలో ‘ఫ్లాగ్ డే’
కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 21: విధి నిర్వహణలో పోరాడి ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ అదనపు ఎస్పీ దూలిపాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించిన (ఫ్లాగ్ డే)లో ఆయన మాట్లాడారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారి సంస్మరణార్థం ఏటా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సం విర్వహిస్తున్నామన్నారు. గడిచిన ఏడాది కాలంలో విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా 377 మంది పోలీస్ అధికారులు మృతిచెందారన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారని, వారికి సహాయ సహకారాలు అందివ్వాలన్నారు. దేశంలో తీవ్రవాదం, ఉగ్రవాదంతో పాటు సంఘ విద్రోహక శక్తుల అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీస్శాఖ పని చేస్తున్నదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారన్నారు. అనంతరం ఏడాది కాలంలో మృతిచెందిన పోలీసు అమర వీరుల పేర్లకు చెందిన ‘షహీద్ పుస్తక్’ని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు శబరీశ్, వినీత్. బిరుదరాజు రోహిత్ రాజు, కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర బాబు, ఆర్ఐ (అడ్మిన్) తుత్తురు దామోదర్, ఎంటీవో బి.సోములునాయక్, అన్ని సబ్డివిజన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.