గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మోత్కుపల్లి, అక్కడి నుంచి బషీర్బాగ్ చౌరస్తాలోని మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అభిమానులు, దళిత నాయకులు, పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్కు భారీగా తరలివెళ్లారు.