వానకాలం పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయండి
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలి
కూరగాయల మార్కెటింగ్కు స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలి
నెలాఖరులోగా వ్యాక్సినేషన్ పూర్తి కావాలె
ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలి
అధికారులతో సమీక్షలో విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
షాబాద్, జనవరి 18 : వానకాలంలో పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఆ దిశగా జిల్లాలో రైతులు పండించిన పంటను కొనాలని మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, సివిల్ సప్లయ్ అధికారి శ్యామారాణి తదితరులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటిరకు 41వేల151 మెట్రిక్ టన్నుల 38 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంకా మూడు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి కొనబోమని ప్రకటించడంతో జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై మంత్రి సమీక్షించారు.
వానకాలంలో జిల్లాలో లక్ష ఎకరాల్లో రైతులు వరి పండించగా.. ప్రస్తుతం ఇప్పటివరకు 300 ఎకరాల్లో వరి పండిస్తున్నట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయన్నారు. వరికి బదులుగా నగరానికి అతి సమీపంలో ఉన్నందున కూరగాయలు, ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టేలా వ్యవసాయశాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. కూరగాయల సాగుకు సంబంధించి మార్కెటింగ్లో స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలని మంత్రి తెలిపారు. రైతులు రాబడి ఇచ్చే పంటల సాగుపై దృష్టి పెట్టేలా చూడాలన్నారు. రైతు బంధుకు సంబంధించి జిల్లాలో 2,91,167 మంది రైతులకు రూ.317 కోట్లకు పైగా నిధులు జమ చేసినట్లు తెలిపారు.
నెలాఖరు వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
జిల్లాలో ఈ నెలాఖరు వరకు వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ అమలుపై మంగళవారం మంత్రి తన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 27,21,906 మంది మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోగా, 19,74,621మందికి రెండో డోస్ వేసినట్లు తెలిపారు. 15-18 ఏండ్ల వారిలో లక్షా77వేలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 84వేల మందికి టీకా వేసినట్లు చెప్పారు. బూస్టర్ డోస్ ఇప్పటివరకు 4వేల మందికి వేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యేలతో స్థానిక వైద్యాధికారులు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. వ్యాక్సిన్ ప్రక్రియలో ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్, ఎంపీటీసీలను భాగస్వామ్యం చేయాలని, లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. వలస కార్మికులు, ఇతర ప్రాంతాలవారు మొదటి డోస్ జిల్లా పరిధిలో, రెండో డోస్ మరో ప్రాంతంలో వేసుకోవడంతో వ్యాక్సిన్ శాతంలో తేడా కనిపిస్తున్నదని వైద్యాధికారులు మంత్రికి వివరించారు.