యాదాద్రి, డిసెంబర్17: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శుక్రవారం అర్చకులు ధనుర్మాన ఉత్సవాలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. బాలాలయ మండపంలో వేద మంత్రాలు పటిస్తూ గోదాదేవికి తిరుప్పావై పూజలు నిర్వహించారు. అనంతరం ధనుర్మాన విశిష్టతను భక్తులకు వివరించారు. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠించారు. స్వామి, అమ్మవార్లను తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు.
విశేష పుష్పాలతో..
లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ఊంజల్ సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త, తనను కొలిచిన వారికి తానున్నానంటూ అభయ హస్తమిచ్చే లక్ష్మీ అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు 600 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మ వారిని స్థుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది.
ఆర్జితపూజల కోలాహలం
స్వామివారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాల నుంచి రూ. 9,14,616 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.