వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 180 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం
ఉమ్మడి జిల్లాలో 2,407 ప్రభుత్వ పాఠశాలలు.. 2.66 లక్షల వరకు విద్యార్థులు
నాణ్యమైన విద్యనందించేందుకు పక్కా ప్రణాళిక
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 17: ప్రభుత్వ బడుల బలోపేతంపై సర్కార్ దృష్టి సారించింది. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ‘మన ఊరు-మన బడి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని 180 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన జరుగుతుండగా.. వచ్చే ఏడాది నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 2,407 ఉండగా, 2.66 లక్షల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు.
సర్కారు బడుల దశ మారనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకుగాను చర్యలు చేపట్టింది. ఇందుకుగాను ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ప్రణాళికను రూపొందించారు. అంతేకాకుండా ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను ప్రారంభించడం, నాణ్యమైన విద్యనందించడంతోపాటు మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు కూడా అందిస్తుండడం వంటి కార్యక్రమాలను గత ఐదారేండ్లుగా ప్రభుత్వం చేపడుతూ వస్తున్నది. గతంతో పోలిస్తే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మార్పు వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేస్తున్న కృషితో గత రెండు, మూడేండ్లుగా ప్రైవేట్ స్కూళ్ల నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దఎత్తున చేరుతుండడం గమనార్హం. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండడం పేద విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారుతుండడం, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు బలోపేతం కావడంతో ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ సమూల మార్పునకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో 764 ప్రాథమిక పాఠశాలలు, 116 ప్రాథమికోన్నత పాఠశాలలు, 174 ఉన్నత పాఠశాలలు, టీఎస్ఎంఎస్ 9, కేజీబీవీలు 18, టీఎస్ గురుకులాలు 26 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో లక్షా 10వేల మంది వరకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇందులో గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుండగా రెండు కేజీబీవీలలో ఆంగ్ల మాధ్యమం బోధన కొనసాగుతున్నది. ఈ సంవత్సరం నుంచి జిల్లా పరిధిలోని 20 పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు ప్రతిపాదనలు పంపించడంతోపాటు అమలు జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు అనధికారికంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ద్వారా పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందనుంది.
వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం..
వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తీసుకురావాలని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల బలోపేతానికిగాను మన ఊరు-మన బడి కార్యక్రమానికి ఆమోదం తెలిపిన కేబినెట్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 180 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమల్లోకి తీసుకువచ్చారు. ఇందులో 100 ప్రాథమిక పాఠశాలలు, 80 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలవుతుంది. అయితే వచ్చే ఏడాది నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమల్లోకి రానుంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు-1300 ఉండగా, మొత్తం 1.56 లక్షల మంది విద్యార్థులున్నారు. ఆంగ్ల మాధ్యమంపై ఉపాధ్యాయులు మరింత పట్టు సాధించేందుకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఆంగ్ల మాధ్యమం అమలుతో పేదవిద్యార్థులకు మేలు
పరిగి, జనవరి 17 : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనపై అధ్యయనం చేసి, విధి విధానాలు రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అధ్యక్షతన మంత్రులు ఈశ్వర్, కేటీఆర్, శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, జగదీశ్రెడ్డి, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, అజయ్కుమార్, దయాకర్రావు సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు సంబంధించిన విధి విధానాలు రూపొందించడంతోపాటు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ‘మన ఊరు-మన బడి’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్యాబోధన కోసం రూ.7289కోట్లు వెచ్చించి ఈ ప్రణాళికను అమలు చేయనుంది.