హైవేపై నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలి
వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
పరిగి, జనవరి 17 : పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఆదేశించారు. సోమవారం పరిగి పోలీస్స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేసి మాట్లాడారు. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు పూర్తి భరోసా, ధైర్యం ఇచ్చేలా విచారణ నిర్వహించాలని పేర్కొన్నారు. డయల్ 100కు కాల్ వచ్చిన వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. దరఖాస్తులు పెండింగ్లో లేకుండా తక్షణమే పరిష్కరించాలన్నారు. పోలీస్స్టేషన్లో రికార్డులను ఆన్లైన్లో పొందుపరుస్తూ 5ఎస్ అమలు చేయాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, తమకు కేటాయించిన గ్రామాలకు తప్పనిసరిగా వెళ్లి గ్రామ పెద్దలు, యువకులతో కలిసి సమస్యలను తెలుసుకొని ఉన్నతాధికారులకు చేరవేస్తూ వెంటనే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాంకేతికంగా పూర్తి అవగాహన కలిగివుండాలని, అవసరమైన సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని చెప్పారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో తప్పనిసరిగా సమయపాలన పాటించాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. పోలీస్స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరుగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని, అందుకనుగుణంగా పెట్రోలింగ్ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రతిరోజూ వాహనాలు తనిఖీ చేయాలని, బ్లూ కోల్ట్స్, పెట్రోల్ కార్ విధులు నిర్వర్తించేవారు విజిబుల్ పోలీసింగ్ చేయాలని సూచించారు.
ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమస్యలు సృష్టించేవారిపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే రౌడీషీట్స్ తెరవాలని అన్నారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై నిఘా ఏర్పాటు చేయాల్సిందిగా ఎస్పీ సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించనివారిపై విపత్తు నిర్వహణ కింద కేసు నమోదు చేయాలన్నారు. గుట్కా, గంజాయి వంటి నిషేధిత పదార్థాల అమ్మకాలు, అక్రమ రవాణా నిరోధించడం, అక్రమ వ్యాపారాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. జాతీయ రహదారి 163పై రోడ్డు ప్రమాదాలు జరుగకుండా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, హైవేపై ఎలాంటి వాహనాలు నిలుపకుండా చూడాలన్నారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించి బాధితులను దవాఖానకు పంపించి హైవేపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఎస్పీ పేర్కొన్నారు. సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం పరిగి సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకటరామయ్య, పరిగి ఎస్ఐ విఠల్రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.