వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి
గుండాల, నవంబర్ 15 : రైతులు అధైర్యపడొద్దని, వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల కేంద్రంతోపాటు సుద్దాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఈ ఏడాది వానకాలం 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వ్యవసాయాధికారులు అంచనా వేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఒప్పిస్తుందన్నారు. కేంద్రం అబద్ధపు మాటలు చెప్తుందని, రైతులు ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. రైతులు యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూ.15 వందల కోట్ల టర్నోవర్తో ముందుకు సాగుతుందని తెలిపారు. గతంలో రూ.9 వందల కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంకు కేవలం ఏడాదిన్నరలోనే రూ.6 వందల కోట్ల టర్నోవర్తో ముందుకెళ్లడం సంతోషకరమన్నారు. నవంబర్ 1 నుంచి 30 వరకు డీసీసీబీ మాసోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. అన్ని బ్యాంకుల కంటే డీసీసీబీలో ఎక్కువ వడ్డీ ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత రైతుల బిడ్డలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇండ్లు నిర్మించుకునే రైతులకు వ్యవసాయ భూమిని తనఖా పెట్టుకుని గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు రుణం ఇస్తున్నట్లు వెల్లడించారు. గుండాల వ్యవసాయ పరపతి సహకార సంఘానికి త్వరలోనే పంట రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతిశోభన్బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్రెడ్డి, సర్పంచ్ గూడ ఉపేంద్ర, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఖలీల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ మూగల శ్రీనివాస్, రైతుబంధు కన్వీనర్ గడ్డమీది పాండరి, జిల్లా డైరెక్టర్ సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ భిక్షం, వైస్ చైర్మన్ యాదలక్ష్మి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, నాయకులు దశరథ, రాములు, బాల్రెడ్డి, ప్రకాశ్, రంజిత్రెడ్డి పాల్గొన్నారు.