వరుస విజయాలతో టీఆర్ఎస్ దూకుడు
ఏడాదిలో ఇది మూడో గెలుపు
గతంలో హుజూర్నగర్, సాగర్ ఉప ఎన్నికల్లో సైతం
పట్టభద్రుల ఎన్నికల్లోనూ విజయకేతనం
స్థానిక సంస్థల్లో కూడా మెజార్టీ టీఆర్ఎస్దే
మంచుకొండలా కరిగిపోతున్న కాంగ్రెస్ ప్రతిష్ట
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఏర్పాటుకు ముందు నల్లగొండ అంటే కాంగ్రెస్ ఉద్ధండుల జిల్లాగా పేరుండేది. కానీ స్వరాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లోనే దాన్ని బద్దలు కొడుతూ టీఆర్ఎస్ తన జైత్రయాత్రను మొదలు పెట్టింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసిందే లేదు. ఎన్నికలు ఏవైనా విజయకేతనం ఎగురవేస్తూ దూసుకుపోతున్నది. ఈ ఒక్క ఏడాదిలోనే మూడు భారీ విజయాలను సొంతం చేసుకుని నల్లగొండను గులాబీ కంచుకోటగా చాటిచెప్పింది. హుజూర్నగర్, సాగర్ ఉపఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో సైతం ఘనవిజయాన్ని సొంతం చేసుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్కు సాటిలేదని నిరూపించింది. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయయాత్రను కొనసాగించింది. భారీ మెజార్టీతో పార్టీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు. వరుస విజయాలస్ఫూర్తితో వచ్చే సాధారణ ఎన్నికలపై ఇప్పటినుంచే దృష్టి సారిస్తామని జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం.
ఆది నుంచే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో ఆదినుంచి ఉమ్మడి నల్లగొండ తనదైన పాత్ర పోషిస్తూ వచ్చింది. టీఆర్ఎస్ తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కూడా వేదికగా నిలిచిన జిల్లా నేటి వరకు గులాబీ అడ్డగానే కొనసాగుతోంది. ఇక రాష్ట్ర ఏర్పాటు నుంచి పూర్తి రాజకీయపార్టీగా అవతరించిన టీఆర్ఎస్ను జిల్లా ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. టీఆర్ఎస్ జిల్లాలో సాధిస్తున్న వరుస విజయాలే అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తొలినాళ్లు.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దీటైన పోటీనిస్తూ భువనగిరి ఎంపీ స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొని తొలిసారి సత్తా చాటింది. దాంతో ఇతర పార్టీల నుంచి ముఖ్యనేతలు సైతం టీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతూ వచ్చారు. 2016లోనే అప్పటి ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్రకుమార్ టీఆర్ఎస్లో చేరారు. 2018 చివరలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించింది. మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింట్లో జయకేతనం ఎగురవేసింది. తర్వాత నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లోకి చేరడంతో ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. ఈ ఎన్నికల్లో ఉద్ధండులుగా చెప్పుకొనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కుందూరు జానారెడ్డి వంటి నేతల వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఇక 2019 అక్టోబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సొంతగడ్డ హుజూర్నగర్లో ఆయన సతీమణి పద్మావతిని టీఆర్ఎస్ ఓడించింది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి 40వేల పైచిలుకు రికార్డు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2020 డిసెంబర్లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో నర్సింహయ్య తనయుడు భగత్ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన మెజార్టీనే అక్కడ ఇప్పటి వరకు అత్యధికం కావడం విశేషం. మార్చిలో పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి వరుసగా రెండో సారి ఘన విజయం సాధించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ..
2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తొలిసారిగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లా మూడు జిల్లాలుగా ఏర్పాటయ్యాక జరిగిన ఈ ఎన్నికల్లో ఎక్కువ చోట్ల ఏకపక్ష విజయాలను సాధించింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జడ్పీ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. మెజార్టీ జడ్పీటీసీలను, ఎంపీపీ స్థానాలను, మున్సిపాలిటీలను గెలుచుకుంది. మున్సిపాలిటీల్లోనూ చండూర్ మినహా అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. ఇటీవల చండూర్ మున్సిపల్ చైర్పర్సన్ సైతం మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సహకార ఎన్నికల్లోనూ ఘనవిజయాలతో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, పార్టీ రాష్ట్ర నేతలు, ఇతర ముఖ్యులు ప్రతి ఎన్నికల్లోనూ కీలకపాత్ర పోషిస్తూ పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తున్నారు. గ్రామగ్రామాన పటిష్ట పార్టీ యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఎన్నికల్లో శక్తివంచన లేకుండా కృషి చేస్తుండడం వరుస విజయాలకు కారణాలే. పార్టీ అధినేత కేసీఆర్, యువనేత కేటీఆర్ ఇచ్చే ప్రతి పిలుపులో భాగస్వాములై పార్టీని జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల చరిత్ర మంచుకొండల్లా కరిగిపోతుందన్న చర్చ సర్వత్రా జరుగుతున్నది. అందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఓట్లు ఉన్నా… పోటీకి వెనకంజ వేయడమే తాజా ఉదాహరణగా చూపుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఆ పార్టీ పరిస్థితి తయారైందని, అందుకే పార్టీకి చెందిన వారు కూడా టీఆర్ఎస్కు ఓట్లేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.