తుర్కపల్లిలో ప్రారంభానికి సిద్ధమైన కొత్త భవనం
రూ.కోటి వ్యయంతో నిర్మాణం
తుర్కపల్లి, నవంబర్ 13 : మండల కేంద్రంలోని భువనగిరి గజ్వేల్ రహదారిలో కొత్త హంగులతో రూ.కోటి వ్యయంతో చేపట్టిన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్ గ్రామం లోపల, ప్రధాన చౌరస్తాకు అర కిలోమీటర్ దూరంలో ఇండ్ల మధ్య ఉండడంతో స్టేషన్కు వచ్చే మండల ప్రజలతోపాటు గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దాంతో పోలీస్స్టేషన్ను మెయిన్రోడ్డుకు తీసుకురావాలని ప్రజాప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు భావించారు. కొత్త పోలీస్స్టేషన్ భవన నిర్మాణం చేపట్టేందుకు అనువైన స్థలాన్ని ప్రధాన రహదారికి సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఎకరం స్థలం కేటాయించారు. భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్భగవత్ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు చురుకుగా సాగాయి. అధునాత టెక్నాలజీతో పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. భవన నిర్మాణం గ్రౌండ్ఫ్లోర్ 3,753 చదరపు అడుగులు, మొదటి అంతస్తు 1290 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. ఎస్హెచ్ఓ, రైటర్, రికార్డులు, స్టాఫ్ కోసం ప్రత్యేక గదుల నిర్మాణంతోపాటు లాకప్ గదులు, మహిళల విశ్రాంతి గది, రిసెప్షన్, వెయిటింగ్ రూమ్ నిర్మించారు. ప్రస్తుతం భవన నిర్మాణం మొత్తం పూర్తికాగా పార్టిషన్ పని చివరి దశలో ఉంది. త్వరలోనే నిర్మాణ పనులు పూర్తిచేసి భవనాన్ని పోలీస్ శాఖకు అప్పగించనున్నట్లు కాంట్రాక్టర్ తెలిపారు. ప్రధాన రహదారి వెంట పోలీస్ స్టేషన్ నిర్మాణంతో ప్రజలకు అందుబాటులో ఉండి శాంతి భద్రతలు మెరుగుపడుతాయని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు తొలగనున్నాయి
ప్రస్తుతం ఉన్న పోలీస్స్టేషన్ గ్రామం మధ్యలో ఉండడంతో మండల ప్రజలకు కొంత అసౌకర్యంగా ఉంది. కొత్త భవన నిర్మాణం ప్రధాన రహదారిలో చేపట్టడంతో వారి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పోలీస్స్టేషన్ ప్రధాన కూడలికి దగ్గరగా ఉండడంతో నేరాలు తగ్గి శాంతిభద్రతలు మెరుగుపడతాయి.
-బీకూనాయక్, జడ్పీ వైస్ చైర్మన్