అర్హులైన వారికి ఫోన్ద్వారా సమాచారం
60 ఏండ్లు పైబడిన, రెండో డోసు వేసుకుని 9 నెలలు పూర్తైన వారు అర్హులు
జంట సర్కిళ్లలో ఆరు కేంద్రాలలో బూస్టర్ డోస్ టీకాలు
కేపీహెచ్బీ కాలనీ, జనవరి 12 : కరోనా మహమ్మారి వివిధ రూపాలలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. గతేడాది కాలంగా ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేసిన జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖఅధికారులు బూస్టర్ డోస్ (ప్రికాసినరి డోస్) వేసేందుకు సిద్ధమయ్యారు. రెండు డోస్ల టీకాలు వేయించుకోవాలని.. రెండో డోసు వేసుకుని తొమ్మిది నెలలు పూర్తైన వారు బూస్టర్ డోస్ వేసుకోవాలని ప్రచారం ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు సూపర్స్ప్రెడర్లకు మొదటి ప్రాధాన్యతనిస్తూ బూస్టర్ టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బూస్టర్ డోస్ టీకాలు వేయించుకోవడానికి అర్హులైన వారికి ఫోన్ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు.
జంట సర్కిళ్లలో ఆరు కేంద్రాలు..
కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలోని ఆరు కేంద్రాలలో బూస్టర్ డోస్ టీకాలు వేస్తున్నారు. మూసాపేట సర్కిల్లోని కూకట్పల్లి (బాలాజీనగర్), మూసాపేట, పర్వత్నగర్ ప్రభుత్వ పట్టణ ఆరోగ్య ఉప కేంద్రాలు, కూకట్పల్లి సర్కిల్లోని బాలానగర్ ఎల్లమ్మబండ, జగద్గిరిగుట్ట హనుమాన్నగర్ ప్రభుత్వ పట్టణ ఆరోగ్య ఉప కేంద్రాలలో బూస్టర్ డోస్ టీకాలు వేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు టీకాలు వేస్తున్నారు.
రోజువారీగా సమాచారం..
కరోనా బూస్టర్ డోస్ వేసుకోవడానికి అర్హులైన వారికి ఫోన్ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. దీనికోసం కూకట్పల్లి జంట సర్కిళ్లలో ఏడుగురు సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేశారు. మొదటి రెండు టీకాలు వేసుకుని.. తొమ్మిది నెలలు పూర్తైన ఫ్రంట్లైన్ వర్కర్లకు ఫోన్ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. రోజువారీగా 700 నుంచి 900 మంది అర్హత కలిగిన వారికి ఫోన్ద్వారా సమాచారమిస్తున్నారు. బూస్టర్ డోస్ వేసుకోవడానికి మీరు అర్హులని సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాలకు వెళ్లి తప్పనిసరిగా టీకా వేసుకోవాలని కోరుతున్నారు.