ఖానాపురం/దుగ్గొండి, జనవరి 11: జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతన్నను ఆగమాగం చేసింది. ముఖ్యంగా మక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఖానాపురం మండలం కొత్తూరులో పోతరాజు కట్టయ్యకు చెందిన రెండెకరాల మక్కజొన్న పంట నేలవాలింది. ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ బాలూనాయక్ పంటను పరిశీలించారు. రూ. 60 వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. అదేవిధంగా దబీర్పేట, చిలుకమ్మనగర్, మంగళవారిపేటలో మక్కజొన్న పంట స్వల్పంగా దెబ్బతిన్నది. దుగ్గొండి మండలం అడవిరంగాపురం, రేఖంపల్లి, తొగరామయ్యపల్లి, ముద్దునూరు, గుడ్డేలుగులపల్లి, తిమ్మంపేట, మహ్మదాపురం, వెంకటాపురం, చలపర్తిలో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో మక్కజొన్న పంట నేలవాలింది. తిమ్మంపేట, రేఖంపల్లి, మహ్మదాపురంలో ఎక్కువ శాతం మిర్చి సాగు చేయగా, వర్షానికి తీవ్ర పంట నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను పరిశీలించి పరిహారం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
సంగెం/నర్సంపేట/ఖిలావరంగల్: చెడగొట్టు వానతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పంట చేతికందే సమయంలో గాలిదుమారంతో కూడిన వడగండ్ల వాన పడడంతో అన్నదాతలు ఆగమయ్యారు. సంగెం మండలంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ముమ్మిడివరం, మొండ్రాయిలో మక్కజొన్న పంట నేలవాలింది. ముమ్మిడివరం గ్రామానికి చెందిన రైతు ఇజ్జగిరి అశోక్ మూడెకరాల్లో మక్కజొన్న పంట సాగు
చేయగా గాలిదుమారానికి పూర్తిగా నేలమట్టమైంది. రూ. లక్షన్నర వరకు నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని పంట నష్టపోయిన రైతులు విజ్ఞప్తి చేశారు. కాపులకనపర్తిలో గాలికి టేకుచెట్టు కరంటు తీగలపై పడడంతో రెండు స్తంభాలు విరిగి కిందపడిపోయాయి. విద్యుత్ సిబ్బంది స్పందించి మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. నర్సంపేట మండలంలో సోమవాం రాత్రి గాలిదుమారంతో కూడిన వర్షం పడింది. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు, మక్కజొన్న పంటలు నేలవాలాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోయాయి. మంగళవారం కూడా చల్లటి గాలులు వీచడంతో చలితో ప్రజలు గజగజ వణికిపోయారు. గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్లోని గాడిపల్లిలో సోమవారం రాత్రి కురిసిన వర్షం, ఈదురుగాలులకు మక్కజొన్న పంట ధ్వంసమైంది. సుమారు 40 ఎకరాల్లో పంట నేలమట్టమైనట్లు రైతులు తెలిపారు. కార్పొరేటర్ గద్దె బాబు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దామోదర్ మక్కజొన్న పంటను పరిశీలించారు. నష్ట పరిహారం అందేలా కృషి చేస్తామని అన్నదాతలకు భరోసా ఇచ్చారు.
నల్లబెల్లిలో వడగండ్ల బీభత్సం
నర్సంపేట, జనవరి 11: నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో వడగండ్ల వాన మంగళవారం రాత్రి 7.45 గంటలకు బీభత్సం సృష్టించింది. నల్లబెల్లిలో విపరీతమైన రాళ్లు పడ్డాయి. దీంతో సిమెంట్ రేకుల ఇంటి పైకప్పులు, పంటలు దెబ్బతిన్నాయి. ఆరుబయట ఉన్న వ్యక్తులపై రాళ్లు పడడంతో గాయపడ్డారు. నల్లబెల్లి సబ్స్టేషన్లో పని చేస్తున్న హెల్పర్ పాపిరెడ్డికి రేకులు కూలి గాయాలయ్యాయి. అతడిని వెంటనే దవాఖానకు తరలించారు. పెద్దపెద్ద రాళ్లు కుప్పలుతెప్పలుగా పడ్డాయి. నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, నల్లబెల్లి, రుద్రగూడెం, గొల్లపల్లి, ఆసరవెల్లి, మామిండ్లవీరయ్యపల్లి, కన్నారావుపేట, గుండ్లపహాడ్లో వడగండ్లు పడడంతో కూరగాయల పంటలు, మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు రైతులు వాపోయారు. రాంపూర్లో సర్పంచ్కు చెందిన ట్రాక్టర్పై చెట్టుకూలి పూర్తిగా ధ్వంసమైంది.