మట్కా, గుట్కా, ఇసుకపై నిఘా
జిల్లాపై పట్టు సాధించేందుకు యత్నం
జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను పరిశీలిస్తా
వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
తాండూరు రూరల్, జనవరి 10 : అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పోలీస్స్టేషన్తోపాటు డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికబద్దంగా ముందుకు వెళతామన్నారు. కర్నాటక సరిహద్దులో నుంచి గుట్కాప్యాకెట్ల అక్రమ రవాణా జరుగుతున్నదని, దీనిపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ఇసుక అక్రమ రవాణా, రేషన్ బియ్యంతోపాటు మట్కా నివారణ చర్యలు కూడా తీసుకుంటామని వివరించారు. జిల్లాపై పూర్తి స్తాయిలో పట్టు సాధించేందుకు జిల్లా పర్యటన చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రతీ పోలీస్స్టేషన్ను సందర్శించి ఆయా పోలీస్స్టేషన్ల పనితీరు, సిబ్బంది పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తిలేదన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా పోలీస్స్టేషన్లలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసుకొని పరిష్కారానికి యత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలంధర్రెడ్డి, ఎస్సైలు ఉన్నారు.