పొలాల వద్దే కల్లాల నిర్మాణం.. తీరనున్న రైతుల కష్టాలు
వికారాబాద్జిల్లాలో రూ.28కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
రూ.4.11కోట్లతో 395 నిర్మాణాలు పూర్తి
పరిగి, జనవరి 10 : వ్యవసాయ ఉత్పత్తులు రైతుల చేతికి వచ్చాయంటే ఆ ఊరి రోడ్డుపై నూర్పిళ్లు వేయడం నిత్యం కనిపించేది. గతంలో పొలాల వద్ద కల్లాలు చేసేవారంతా బీటీ రోడ్ల నిర్మాణం తర్వాత వ్యవసాయ ఉత్పత్తులను నూర్పిళ్ల కోసం వేయడం పరిపాటిగా మారింది. రోడ్లపై నూర్పిళ్ల కోసం వ్యవసాయ ఉత్పత్తులు వేయడం ద్వారా అనేకసార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిపై నుంచి ద్విచక్ర వాహనాలు వెళ్లినపుడు కింద పడిపోవడంతో పలువురు గాయాలపాలవుతున్నారు. ఇలాంటి వాటన్నింటికీ చరమగీతం పాడేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి రైతుకు తమ పొలం వద్దే కల్లం నిర్మించుకునేందుకు అవకాశం కల్పించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో సుమారు రూ.28కోట్లు వెచ్చించి రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణానికి సంకల్పించింది. ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాలో 2695 కల్లాల నిర్మాణానికి రూ.21.36కోట్ల నిధులు మంజూరు చేసింది. వివిధ మండలాల్లోని గ్రామాల్లో కల్లాల నిర్మాణానికి రైతుల నుంచి మరిన్ని దరఖాస్తులు సైతం స్వీకరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ రైతులకు అవసరం మేరకు పొలాల వద్ద కల్లాల నిర్మాణం చేపట్టడానికి కృషి జరుగుతున్నది.
మూడు రకాలుగా కల్లాల నిర్మాణం
రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలాల వద్ద కల్లాల నిర్మాణానికి సంకల్పించిన సర్కారు మూడు రకాలుగా నిర్మాణానికి నిధులు అందజేస్తున్నది. ఇందులో ప్రధానంగా 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే కల్లానికి రూ.85000, 60 చదరపు మీటర్ల కల్లానికి 68000, 50 మీటర్ల చదరపు మీటర్ల కల్లానికి రూ.56000 మంజూరు చేస్తున్నది. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ నిధులు అందుతాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం గ్రాంటుగా ప్రభుత్వం నిధులు ఇస్తుండగా ఇతరులు 10శాతం కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 10 ఎకరాల వరకు భూమి ఉన్నా అర్హులు కాగా ఇతరులకు 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. సదరు రైతు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ, జాబ్కార్డు జిరాక్స్ కాపీ జత చేసి దరఖాస్తు అందజేస్తే.. వారికి కల్లం నిర్మాణానికి అనుమతిస్తారు. అధికారులు సూచించిన మేరకు వారు కల్లం నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. రైతు తమకు అనువుగా ఉన్న స్థలం చూపిస్తే మార్కింగ్ ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించాలి. నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు డబ్బులు అందిస్తారు.
రూ.21.36 కోట్లతో 2695 కల్లాల నిర్మాణం
వికారాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో ప్రస్తుతం రూ.21.36కోట్లతో 2695 కల్లాల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో 50 చ.మీ కల్లాలు రూ.167.06లక్షలతో 297, 60 చ.మీ కల్లాలు రూ.235.68లక్షలతో 349, 75 చ.మీ కల్లాలు రూ.1733.56లక్షలతో 2049 నిర్మాణాలకు అనుమతి మంజూరు చేశారు. మూడు రకాల కల్లాల నిర్మాణానికి సంబంధించి ఈ నెల 7న శుక్రవారం వరకు జిల్లాలో 395 కల్లాల నిర్మాణం పూర్తయింది. 569 కల్లాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం వరకు కల్లాల నిర్మాణం కోసం రూ.4.11కోట్లు ఖర్చు చేశారు. మిగతా కల్లాల నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
తీరనున్న రైతుల కష్టాలు
పొలం వద్దే కల్లాల నిర్మాణంతో రైతుల కష్టాలు తీరనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు కోసి గతంలో పొలం వద్దే నూర్పిళ్లు చేసేవారు. గతంలో ప్రతి రైతుకు ఎడ్లు ఉండేవి. ప్రస్తుతం చాలావరకు పశుసంపద తగ్గడంతోపాటు వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం పెరిగింది. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల కోతలు పూర్తి చేసి వాటిని నూర్పిళ్ల కోసం రోడ్లపైకి తీసుకువెళ్లడం, రాత్రిళ్లు రోడ్లపైనా కాపలాగా ఉండాల్సిన పరిస్థితి. కల్లాల నిర్మాణంతో తమ పొలంలోనే నూర్పిళ్లు పూర్తిచేసి వ్యవసాయ ఉత్పత్తులను ఇంటికి చేరవేసే అవకాశం కలుగుతుంది. రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. దీంతో కల్లాలతో రైతులకు మేలు కలుగుతుందన్నది వాస్తవం.
కల్లాల నిర్మాణంతో రైతులకు ఉపయోగం : కృష్ణన్, డీఆర్డీవో
పొలాల వద్ద కల్లాల నిర్మాణంతో రైతులకు ఎంతో ఉపయోగకరం. రోడ్లపై నూర్పిళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల వృథా జరిగేది. పొలంలోనే కల్లాలపై నూర్పిళ్లతో వృథా ఉండదు. రైతులు ముందుకు వచ్చి కల్లాల నిర్మాణం చేపట్టాలి. నిర్మాణం పూర్తయిన వెంటనే రికార్డు చేసి చెక్మెజర్ అనంతరం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. సాధ్యమైనంత త్వరగానే డబ్బులు వస్తాయి. కల్లాల నిర్మాణంతో రైతులకు ఆస్తిగా మిగిలిపోతుంది. రైతులు ముందుకు వచ్చి కల్లాల నిర్మాణం చేపట్టాలి.