ఆర్టీసీ అధికారులతో కలిసి పాత బస్స్టేషన్ సందర్శన
స్థలం, ఇతర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక
నిర్మాణం వైపు వడివడిగా అడుగులు
వరంగల్, జనవరి 9(నమస్తేతెలంగాణ) : అభివృద్ధి బాట పట్టిన వరంగల్లో నూతన ఆర్టీసీ బస్స్టేషన్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయ సూచన మేరకు ఆదివారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆర్టీసీ అధికారులతో కలిసి వరంగల్లోని ప్రస్తుత బస్స్టేషన్ను సందర్శించారు. కాకతీయుల చరిత్ర ఉట్టిపడేలా ఇక్కడ కొత్త బస్స్టేషన్ నిర్మించేందుకు అవసరమైన స్థలం, ఇతర అంశాలను పరిశీలించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. అన్నీ అనుకూలిస్తే నిర్మాణ పనులు వెంటనే మొదలు కానున్నాయి.
చారిత్రక వరంగల్లో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్స్టేషన్ ప్రయాణికులకు అనువుగా లేనందున పక్కన ఉన్న స్థలాన్ని కలుపుకుని నూతన బస్స్టేషన్ను రోల్మోడల్గా నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను ఇటీవల కలిశారు. బస్స్టేషన్ పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కొత్త బస్స్టేషన్ నిర్మాణానికి చకచకా పనులు జరుగుతున్నాయి. ఆర్టీసీ అధికారులు కొద్దిరోజుల క్రితం నిర్మాణంపై కసరత్తు ప్రారంభించారు. ఎస్టిమేట్స్ తయారు చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రమైన వరంగల్లో మోడల్ బస్స్టేషన్ నిర్మించేందుకు అవసరమైన స్థలం, ఇతర అంశాలను పరిశీలించి నివేదిక పంపాలని తాజాగా సీఎంవో ఆర్టీసీ ఉన్నతాధికారులకు సూచించింది. దీంతో ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్తో పాటు ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని ప్రస్తుత బస్స్టేషన్ను విజిట్ చేశారు. బస్స్టేషన్ ఆవరణ, పరిసరాల్లో పర్యటించి మోడల్ బస్స్టేషన్ నిర్మాణం కోసం స్థలాన్ని, ఇతర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక్కడ కాకతీయుల చరిత్ర ఉట్టిపడేలా మోడల్ బస్స్టేషన్ నిర్మాణం కోసం తయారు చేసిన ప్రతిపాదనలపై చర్చించారు. ప్రాథమికంగా రూపొందించిన డిజైన్నూ పరిశీలించారు. జిల్లా కేంద్రమైనందున వరంగల్ వైభవం తెలిసేలా ఇక్కడ బస్స్టేషన్ నిర్మాణం జరగాలని ఎమ్మెల్యే నరేందర్ ఆర్టీసీ అధికారులకు చెప్పారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు గుండేటి నరేందర్, సోమిశెట్టి ప్రవీణ్, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేశ్బాబు, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, టీఆర్ఎస్ నేత గోరంటల మనోహర్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.