హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ20 లీగ్లో ఖమ్మం ఏసెస్ సంచలన విజయంతో ఫైనల్స్కు దూసుకెళ్లింది. లీగ్లో పరాభవమెరుగని హైదరాబాద్ ఈ-చాంపియన్స్కు క్వాలిఫయర్స్-1లో ఓటమి రుచిని చూపించింది. ఇరుజట్ల మధ్య గురువారం రాత్రి జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో ఖమ్మం.. 10 పరుగుల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 రన్స్ చేసింది. మికిల్ జైస్వాల్ (76), జీఎస్కే రెడ్డి (40) రాణించారు. హైదరాబాద్ 20 ఓవర్లకు 190/8 వద్దే ఆగిపోయింది. ఆ జట్టు తరఫున వికాస్ (69) టాప్ స్కోరర్గా నిలిచారు.
అంతకుముందు జరిగిన ఎలిమినేటర్లో కరీంనగర్ డైమండ్స్ 75 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్స్ను చిత్తుచేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. టోర్నీలో సెంచరీల మోత మోగిస్తున్న కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (61 బంతుల్లో 137, 11 ఫోర్లు, 10 సిక్స్లు) మూడో శతకంతో చెలరేగగా ఆ జట్టు 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 238 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో కరీంనగర్ బౌలర్ ఆశిష్ శ్రీవాత్సవ్ (5/16) ఐదు వికెట్ల ప్రదర్శనతో రంగారెడ్డి 16.3 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్స్-2లో కరీంనగర్.. హైదరాబాద్తో తలపడనుంది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది.