స్పందించిన ఎస్బీఐ ఉన్నతాధికారులు
మక్తల్రూరల్, డిసెంబర్ 7: మహిళా సమాఖ్య స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలకు పాల్పడిన ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ కరస్పాండెంట్ జానకి నుంచి అధికారులు డబ్బులను రికవరీ చేస్తున్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని సంగంబండ రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్ కార్యాలయంలో మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించి బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. ఈనెల 7న ‘రికవరీలో చేతివాటం’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఎస్బీఐ ఉన్నతాధికారులు స్పందించారు. మక్తల్, మాగనూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా సమాఖ్యలు తీసుకున్న రుణాలకుగానూ తిరిగి సభ్యులు చెల్లించిన రికవరీ డబ్బులలో దాదాపు రూ.6.50లక్షలు అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ కరస్పాండెంట్ జానకి అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున డబ్బులు స్వాహా చేశారు. తక్షణమే సంబంధిత సీఎస్పీ కరస్పాండెంట్ నుంచి నిధులను రికవరీ చేయాలని మక్తల్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్రావుకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. మక్తల్ మండలంలోని భూత్పూర్, పంచదేవ్పహాడ్, ఉప్పర్పల్లి, మాగనూర్ మండలంలోని అడవిసత్యారం, వడ్వాట్ తదితర గ్రామాలకు సంబంధించిన మహిళా సంఘాల సభ్యులు స్థానిక ఎస్బీఐ బ్యాంక్కు వచ్చి తమ ఖాతాలను జానకి ఎదుట సరిచూసుకుని వెళ్లారు.
మహిళా సంఘాలతో విచారణ
మక్తల్ ఎస్బీఐ సీఎస్పీలో జరిగిన రుణాల రికవరీ చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై మంగళవారం మక్తల్ మండలంలోని భూత్పూర్ గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో ఏపీఎం నారాయణ విచారణ జరిపారు. 2020లో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నుంచి వడ్డీలేని రుణాలను మంజూరు చేయగా అట్టి డబ్బులను బ్యాంక్లకు రికవరీ చేయడంలో జరిగిన అక్రమాలపై ఆయన ఆరా తీశారు. ఈమేరకు సుధాకర్, భాగ్యలక్ష్మి, శ్రీరామ మహిళా సంఘాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడెప్పుడు లోన్స్ చెల్లించారు.. బ్యాంక్లో చెల్లించారా? లేక సీఎస్పీ కేంద్రంలో కట్టారా? అని ప్రశ్నించారు. తాము ఇదివరకు బ్యాంక్లో డబ్బులు జమ చేసేవారమని, అయితే కరోనా వచ్చిన తర్వాత బ్యాంక్ అధికారులు బయట ఉన్న సీఎస్పీలో చెల్లించాలని చెప్పారని పలువురు మహిళలు తెలిపారు. గతకొన్ని నెలల నుంచి అక్కడే డబ్బులు జమ చేస్తున్నామని, దీనికి సంబంధించిన రసీదు ఇచ్చారని వారు ఏపీవోకు చూపించారు. ఇంకా ఎవరైనా సీఎస్పీలో డబ్బులు చెల్లించి తేడాలు ఉంటే ఖాతాలను సరిచూసుకోవాలని ఏపీవో కోరారు.