గౌరవ వేతనం 30శాతం పెంపు
ఇక నుంచి రూ.15500లు పొందనున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు
2021 జూన్ 1 నుంచే వర్తింపు
కార్మికుల్లో ఆనందోత్సాహాలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నర్సంపేట, జనవరి 7 : ప్రభుత్వం కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నది. మురుగును శుభ్రం చేస్తూ, కొవిడ్ కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి ముందుండి సేవలందించిన వారికి అండగా నిలుస్తున్నది. వారి కృషిని గుర్తిస్తూ గౌరవ వేతనాలను 30శాతం పెంచుతూ జీవో విడుదల చేసింది. పెరిగిన వేతనాలను 2021 జూన్ నుంచి వర్తింపజేస్తామని అందులో స్పష్టం చేసింది. ఇకపై ప్రతినెలా రూ.15500 అందుకోనున్నారు. దీంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జీతం పెంచి బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.
జిల్లాలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1500 మంది, వర్ధన్నపేటలో 80 మంది, నర్సంపేటలో 180 మంది ఔట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ 30 శాతం వేతనాల పెంపుతో న్యాయం జరుగనుంది. పీఆర్సీ అమలును కూడా వీరికి వర్తింప జేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలను నిర్వహిస్తున్నారు. కార్మికులు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రూ. 7వేల వేతనంతోనే పనిచేసేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వీరిని గుర్తించి నెలకు రూ.12500లకు పెంచారు. అనంతరం కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో ప్రాణాలకు తెగించి వీరు చేసిన పారిశుధ్య పనులను గుర్తించి వేతనాలను మరో 30 శాతం పెంచడమే కాకుండా, పీఆర్సీ వర్తింపజేశారు. దీంతో ప్రస్తుతం వీరు నెలకు రూ.15500 వరకు వేతనం అందుకోనున్నారు. గత ప్రభుత్వాలు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను ఏజెన్సీల ద్వారా అందించే వారు. వీరు కాంట్రాక్టర్ కింద పనిచేసే వారు. వేతనాలు సరిగా ఇచ్చేవారు కాదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంట్రాక్ట్, ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. ప్రస్తుతం వారి బ్యాంక్ అకౌంట్లలో నేరుగా వేతనాలు వేస్తున్నారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..
నర్సంపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులను పలుసార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుండెబోయిన కొమురయ్య, హమాలీ యూనియన్ నాయకుడు కొల్లూరి లక్ష్మీనారాయణ, మాదాసి సారయ్య, గడ్డం సమ్మయ్య, బొచ్చు భాస్కర్రాజు, రాంబాబు, యశోద, ఉమా, ప్రవీణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్సీ అమలు సంతోషం..
ఔట్ సోర్సింగ్ కార్మికులకు పీఆర్సీ 30 శాతం అమలు చేయడం సంతోషకరం. మున్సిపాలిటీల్లో ఎంతో కష్టపడి చెత్తనంతా తొలగిస్తున్నం. గతంలో చాలా తక్కువ వేతనాలపై పనిచేసేటోళ్లం. కార్మికులకు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. నేరుగా అకౌంట్లలో పడేలా చేశారు. కార్మికు లు తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. – మాదాసి నర్సింహారావు, మున్సిపల్ కార్మికుడు, నర్సంపేట
ప్రాణాలకు తెగించి పనిచేశాం..
కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. కరోనా రోగుల వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు తొలగించాం. అలాంటి మున్సిపల్ కార్మికులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వేతనాలు పెంచి ప్రోత్సహిస్తున్నది. 30 శాతం వేతనాల పెంచడంతో కార్మికులు పెద్ద ఎత్తున సంబురాలు చేస్తున్నారు. – అల్వాల రాజు, మున్సిపల్ కార్మికుడు