మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చింతకాని, డిసెంబర్ 5 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో సమస్యలు మాయమయ్యాయని, పల్లెలకు అధిక నిధులు కేటాయించడం హర్షణీయమని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం చింతకాని, కోమట్లగూడెం, బస్వాపురం, గాంధీనగర్ తదితర గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాల్లో భాగంగా జరిగిన పనులను పరిశీలించి ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. చింతకానిలో ఇటీవలే రైలు ప్రమాదంలో మృతిచెందిన కో-ఆప్షన్ సభ్యుడు షేక్ రంజాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పథకాలున్నా పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో పల్లె ప్రగతి పథకం ద్వారా పల్లెలకు అధిక నిధులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కరెంట్ సమస్యలు పల్లెల్లో అనేకం ఉండేవని, పల్లె ప్రగతి ద్వారా అధికారులే గ్రామాల్లో నిరంతరం ఉంటూ పనులు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ సబ్బండవర్గాల అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆయన వెంట మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామశాఖ నాయకులు ఉన్నారు.