గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు
పల్లెల్లో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు
ఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల్లో సాగు
ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఉట్నూర్ రూరల్, నవంబర్ 05 :పోడు భూములకు హక్కు పత్రాలు అందిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో అటవీశాఖ ఆ దిశగా చర్యలు చేపడుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,08,959 ఎకరాల అటవీ భూముల్లో వ్యవసాయం చేస్తున్నట్లు గుర్తించగా, అర్హులందరికీ పట్టాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నది. ఆ మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు నియమించింది. ఇప్పటికే సూపర్ వైజర్ కమిటీలు పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఫారెస్ట్ రైట్స్ కమిటీలు ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అడవిబిడ్డల కల నెరవేరనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల అటవీభూముల్లో వ్యవసాయం జరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా లో 56,140 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 19,543 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 8,276 ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబా ద్ జిల్లాలో 25వేల ఎకరాల్లో పోడు వ్యవసాయం జరుగుతున్న ట్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్ధారించారు. అర్హులైన వారికి ప ట్టాలు పంపిణీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏలు, బీట్ అధికారులు గ్రామస్థాయి సూపర్వైజరీ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు గ్రామాల్లో ఫారెస్ట్ రైట్స్ కమిటీలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లోని ఫారెస్ట్ రైట్స్ కమిటీలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. ఏజెన్సీ గ్రామాల్లోని అటవీహక్కుల కమిటీల్లో సభ్యులుగా గిరిజనులు, నాన్ ఏజెన్సీలో రెండింటిలో మూడోవంతు గిరిజనులు, రెండు ప్రాంతాల్లోని కమిటీల్లో ఒకటింట మూడోవంతు మహిళలు సభ్యులుగా ఉంటారు.
8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలో పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించి పట్టాల పంపిణీకి సంబంధించి పలు సూచనలు చేశారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే పోడు ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కలెక్టర్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు విపక్ష పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించిన వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. అటవీభూములకు హక్కు పత్రాలు అందించడంలో భాగంగా ఈ నెల 8 నుంచి దరఖాస్తుల పంపిణీ ప్రక్రియ ప్రారంభవుతుంది. 2005 డిసెంబర్ 13వ తేదీకంటే ముందు సాగులో ఉన్న వారు హక్కు పత్రాలు పొందడానికి అర్హులు కాగా, గ్రామాల్లో ఫారెస్ట్ రైట్స్ కమిటీలో గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాయి. కమిటీ సభ్యులు అర్హులకు భూ హక్కు కల్పించేలా చర్యలను తీసుకుంటారు. సాగులో ఉన్న భూములకు సంబంధించిన పత్రాలు పరిశీలించి డివిజన్ స్థాయి అధికారులకు పంపిస్తారు. వివరాలను పరిశీలించిన డివిజన్ స్థాయి అధికారులు జిల్లా స్థాయి కమిటీకి సిఫార్సు చేస్తారు. భూముల హక్కుల విషయంలో జిల్లా స్థాయి కమిటీదే తుది నిర్ణయమవుతుంది. పది ఎకరాల వరకు అర్హులు కాగా నిబంధనల్లో సూచించిన విధంగా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కేవలం అటవీ భూములు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్న వారినే గుర్తించి వారికి హక్కు పత్రాలు జారీ చేస్తారు. గ్రామస్థాయి అటవీ హక్కుల కమిటీలు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందుకు 50 శాతం కోరం ఉండాలి. పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభంకావడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎంకు రుణపడి ఉంటాం
ఉట్నూర్ రూరల్, నవంబర్ 5 : మా ఊరి సమీపంలో 2.5 ఎకరాల అటవీ భూమి సాగు చేస్తున్న. నాకు ఇంతవరకు అటవీ హక్కు పత్రాలు రాలేదు. సీఎం కేసీఆర్ పట్టాలు ఇస్తామని చెప్పినందుకు ఆనందంగా ఉంది. ఏండ్లకేండ్లుగా ఎదురు చూస్తున్న మా కల నెరవేరబోతున్నది. ఇకపై మాకు సర్కారు పథకాలన్నీ అందుతాయి. మా బాధలు పట్టించుకున్నందుకు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
-మడావి లక్ష్మణ్, హీరాపూర్ గ్రామ రైతు
అవగాహన కల్పిస్తున్నాం
ఉట్నూర్ రూరల్, నవంబర్ 5 : అటవీ భూములపై ఊరూరా అవగాహన కల్పిస్తు న్నాం. పోడు భూములకు దరఖాస్తు చేసుకునే విధానం గురించి వివరిస్తున్నాం. పట్టాలు అందించేందుకు ప్రత్యేక కమిటీలు నియమిస్తాం.