మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు
కరోనా నెగెటివ్ ఉంటేనే జంటకు అనుమతి
ఫంక్షన్హాల్ నిర్వాహకులకు ముందస్తు నోటీసులు
నిర్మల్ టౌన్, మే 5: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో సర్కారు శుభకార్యాలపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. తహసీల్ కార్యాలయం నుంచి తప్పనిసరి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించింది. పెండ్లి పత్రికతోపాటు ఫంక్షన్హాల్ వివరాలు, నూతన వధూవరుల కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్, పెండ్లికి హాజరయ్యే వారికి తప్పనిసరిగా మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం పాటిస్తామని ఒప్పంద పత్రాన్ని రాసి ఇస్తేనే అనుమతి ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. 50 మంది కంటే ఎక్కువగా బంధువులు హాజరైతే ఫంక్షన్హాళ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చారు. – నిర్మల్ టౌన్, మే 5
కొవిడ్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జన సమూహాలు గూమి గూడే ఫంక్షన్లపై ఆంక్షలు విధిస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ వైరస్ ఉధృతి పెరగడం, ఒకరిని నుంచి మరొకరికి వేగంగా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా వివాహాలు, శుభ కార్యాలు, ఇతర ఫంక్షన్లలో జనం గూమిగూడకుండా నిబంధనలు విధించింది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొవిడ్ నిబంధనల అమలుపై సూచనలు, సలహాలు అందించారు.
ఈనెల 6 నుంచి నెలాఖరు వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున శుభకార్యాలు ఉండడంతో 50కి మించి పాల్గొంటే కేసులు నమోదు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 6, 12, 13, 16, 18, 19, 21, 24, 29తేదీల్లో వందలాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉండడంతో వివాహాలు చేసుకునేవారు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తహసీల్దార్ కార్యాలయంలో తీసుకోవాల్సిందే. పెళ్లి పత్రికతో పాటు ఫంక్షన్హాల్ వివరాలు, నూతన వధువరుల కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్, పెళ్లికి హాజరయ్యే వారికి తప్పనిసరిగా మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం పాటిస్తామని ఒప్పంద పత్రాన్ని రాసి ఇస్తేనే పెళ్లికి అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఫంక్షన్హాళ్లలో పెద్ద ఎత్తున పెళ్లిలు జరిగేందుకు ఆస్కారం ఉండడంతో ఫంక్షన్హాల్ నిర్వాహకులకు ముందస్తు నోటీసులను జారీ చేశారు. ఫంక్షన్హాల్లో పెళ్లి జరుపుకోవాలని ముందే నిర్ణయించుకొని బుక్ చేసుకోగా.. అటువంటి పెళ్లిలో కేవలం 50 మందిని మాత్రమే అనుమతించాలని నిర్వాహకులకు సూచిస్తున్నారు.
50 మంది కంటే ఎక్కువగా హాజరైనట్లయితే ఫంక్షన్హాళ్ల నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునేలా తహసీల్దార్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో పెళ్లిలు నిశ్చయించుకున్న పెళ్లిళ్లు ఘనంగా చేద్దామనుకున్న వారికి ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో ఆంక్షలు అడ్డురావడంతో వాయిదా వేసుకోవడమో లేదా పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలో చేసుకోవడమో నిర్ణయించుకుంటున్నారు. గతేడాది కాలం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పెళ్లిళ్లు చేయాలనుకునే వారికి వైరస్ నిబంధనలు మింగుడుపడడం లేదు. చాలా మంది ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఆడంబరాలకు పోకుండా సొంత ఊళ్లో, ఇంటిలోనే పరిమిత సంఖ్యలో వివాహాలు చేసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు.
అనుమతి పొందాలి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ గ్రామంలో పెళ్లి చేయాలన్నా తప్పనిసరిగా తల్లిదండ్రులు రెవెన్యూశాఖ అనుమతి తీసుకోవాల్సిందే. పెళ్లి చేసుకునే వధూవరుల లగ్నపత్రికతో పాటు కొవిడ్ నెగిటివ్ పత్రం, పెళ్లికి 50 మంది మాత్రమే అనుమతి ఇస్తూ ఒప్పంద పత్రంతో దరఖాస్తు చేసుకుంటేనే అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఫంక్షన్హాళ్లలో జరిగే వివాహాలకు కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇవ్వాలని, ఎక్కువ మంది జనాలకు అనుమతి ఇస్తే ఫంక్షన్హాళ్లపై చర్యలు తీసుకుంటాం.
సుభాష్చందర్, తహసీల్దార్, నిర్మల్