పీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్
రంగారెడ్డి జిల్లాలో పలు ఫారెస్టుల్లో మొక్కల పరిశీలన
షాబాద్, డిసెంబర్ 4 : ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులతో చేపడుతున్న అటవీ పునరుద్ధరణ పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయని పీసీసీఎఫ్(ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) లోకేశ్ జైస్వాల్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని స్థానిక అధికారులతో కలిసి శనివారం ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్లు, శంషాబాద్, మంఖాల్ అటవీ రేంజ్ పరిధుల్లో పర్యటించారు. ప్రతి డివిజన్లో రేంజ్లవారీగా క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల పురోగతి, నాణ్యతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షీణించిన అటవీ ప్రాంతాల్లో అటవీ పునరుజ్జీవ పనుల ద్వారా మళ్లీ పచ్చదనం పెరుగుతుందన్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాలో 29,545 హెక్టార్ల అటవీ ప్రాంతం, 84 ఫారెస్ట్ బ్లాకుల్లో విస్తరించి ఉందన్నారు. పట్టణీకరణకు సమీపంలో ఉన్న విలువైన అటవీ ప్రాంతాలను రక్షిస్తూ, మళ్లీ పచ్చదనం చిగురించేలా కార్యాచరణను అటవీశాఖ అమలు చేస్తున్నదన్నారు. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పట్టణాలు, కాలనీవాసులకు ప్రకృతి, పచ్చదనం, స్వచ్ఛమైన గాలి లభించేందుకు దోహదపడుతుందని చెప్పారు.
అటవీశాఖ నిధులతో పునరుద్ధరణ పనులు
జిల్లాలోని గున్గల్ అటవీ రేంజ్ పరిధిలో రెండు ప్రాంతాల్లో 160 హెక్టార్లలో, గుమ్మడవల్లి, మాదాపూర్లో 105 హెక్టార్లలో, పడకల్ రిజర్వు అటవీ ప్రాంతంలో 70 హెక్టార్లలో, కొత్వాల్గూడ, మల్కారంలో 82 హెక్టార్లలో, పల్లెగూడ రిజర్వు ఫారెస్ట్లో 57 హెక్టార్లలో అటవీశాఖ(కంపా)నిధుల ద్వారా ప్రత్యామ్నాయ అటవీకరణ, అటవీ పునరుద్ధరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. గత మూడు, నాలుగేండ్లుగా నాటిన మొక్కల సంరక్షణతోపాటు, ఖాళీలున్నచోట్ల గ్యాప్ ప్లాంటేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని అటవీ ప్రాంతాల చుట్టూ ఆక్రమణల నివారణలో భాగంగా కందకాలు, చైన్ లింక్ ఫెన్సింగ్ ఏర్పాటు, గట్లపైన గచ్చకాయ చెట్ల పెంపకం, భూసారం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. చెక్డ్యామ్లు, వర్షం నీటి నిల్వ కోసం కందకాల తవ్వకం, నర్సరీల పెంపు, వందశాతం అటవీ పునరుద్ధరణలో భాగంగా మొక్కలు నాటడం, తద్వారా అటవీ సాం ద్రత పెంపు చర్యలను అటవీ శాఖ చేపట్టిందన్నారు. రెండు రోజుల పర్యటనలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన పీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్ పనుల పురోగతి, నాణ్యతపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మరింత సమర్థవంతమైన ఫలితాలు రాబట్టేందుకు అనువుగా సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. రంగారెడ్డిజిల్లాలో చక్కగా అటవీకరణ పనులు అమలు చేస్తున్న అధికారులు, సిబ్బందిని పీసీసీఎఫ్ ఆర్.శోభ అభినందించారు. కార్యక్రమంలో రంగారెడ్డిజిల్లా చీఫ్ కన్జర్వేటర్ సునీతాభగవత్, జిల్లా ఫారెస్ట్ అధికారి జానకీరామ్, డివిజనల్ అధికారి విజయానంద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.