కేంద్రం నిరాకరిస్తున్నా.. ధాన్యం కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
బొంరాస్పేట, డిసెంబరు 4 : రైతుల మేలు కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బురాన్పూర్ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ధాన్యం తూకం చేస్తున్నారా అని రైతులను అడిగారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని అన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టత ఇవ్వకున్నా అన్నదాతల సంక్షేమం కోసం ధాన్యాన్ని కొంటుందని అన్నారు. రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకుడు పత్తి సురేశ్కుమార్ తండ్రి ఇటీవలే మృతిచెందగా, ఎమ్మెల్యే సురేశ్కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
దేవాలయాన్నిప్రారంభించిన ఎమ్మెల్యే
మండలంలోని రేగడిమైలారం గ్రామానికి సమీపంలో జాతీయ రహదారికి పక్కన నిర్మించిన మంద మైసమ్మ దేవాలయాన్ని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు. దేవాలయంలో అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచ్లు లక్ష్మి, రాజేశ్వరి, ఎంపీటీసీలు సుదర్శన్రెడ్డి, జగదీశ్ పాల్గొన్నారు.