మియాపూర్ , డిసెంబరు 4 : మియాపూర్ డివిజన్ పరిధిలోని ఏంఏనగర్లో అసంఘటిత రంగ కార్మికుల పేర్ల నమోదుకు కోసం ఉచిత క్యాంపును శనివారం ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినీల పర్యవేక్షణలో ఈ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వినీల, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు తుడుం అనీల్కుమార్లు మాట్లాడుతూ.. ఈ శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవటం ద్వారా కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. పని ప్రదేశాలలో అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకునే సందర్భాలలో బాధిత కార్మికుల కుటుంబానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారంతా ఉచితంగా ఈ శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవటం ద్వారా కనీస భద్రతను పొందవచ్చునని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకురాలు, లావణ్య, రాజు, భవన నిర్మాణ సంఘం నాయకులు శ్రీను, మధు తదితరులు పాల్గొన్నారు.