సమస్యలపై ఫిర్యాదుకుకంట్రోల్ రూమ్
అందుబాటులోకి 9963407064 నంబర్
రద్దీ నియంత్రణకు టోకెన్ల జారీ
క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా..రంగంలోకి ప్రత్యేక బృందాలు
జనవరి వరకు నిరంతరాయంగా కొనుగోళ్లకు ప్రణాళికలు
నల్లగొండ ప్రతినిధి, నవంబర్3(నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ధర చెల్లింపులో రైతులకు అన్యాయం జరుగకుండా, వీలైనంత వరకు జాప్యం లేకుండా చర్యలు చేపడుతున్నది. ఓ వైపు క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు రైతులు తమ సమస్యలపై ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసింది. నల్లగొండ కలెక్టరేట్లో సివిల్ సప్లయ్ కార్యాలయంలో 9963407064 నంబరును అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే
కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించేందుకు వారంలో రెండు రోజులపాటు కోతలకు విరామం ప్రకటించారు. ధాన్యం విక్రయించేందుకు సమయం, తేదీలతో కూడిన టోకెన్లను జారీ చేస్తున్నారు. దీంతో రైతులకు వాహనాల అనవసర ఖర్చులతోపాటు సమయం ఆదా కానుంది. మరోవైపు ధర చెల్లింపు, తూకాల్లో కోతలపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు నిరంతర నిఘాతో పనిచేస్తున్నాయి.
వారంలో రెండ్రోజులు కోతలకు విరామం
గత వానకాలం ధాన్యం కొనుగోళ్లలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్లో ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. రైతులకు ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు సంబంధిత శాఖల అధికారులంతా దీనిపైనే దృష్టి సారించారు. కోతలు ముమ్మరం కావడంతో వారంరోజులుగా సన్నరకం ధాన్యం రైస్ మిల్లులకు, దొడ్డురకంగా కొనుగోలు కేంద్రాలకు భారీగా వస్తున్నది. పెద్ద ఎత్తున ధాన్యం మార్కెట్ వస్తున్నదని అంచనా వేసిన అధికారులు గత వారం నుంచి వారంలో రెండు రోజులు (గురువార, ఆదివారం) వరికోతల విరామం అమలు చేస్తున్నారు. దీంతో ధాన్యం రాకను క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఏర్పడింది. రైతులంతా ఒకేసారి ధాన్యం తెచ్చి ఇబ్బంది పడకుండా గత సీజన్లో మాదిరిగానే ఈ సారి కూడా టోకెన్ల విధానం అనుసరిస్తున్నారు. ఆయా మండలాల్లోని రైతువేదిక వద్ద అధికారులు రైతులకు టోకెన్లు జారీ చేస్తున్నారు.
కొనుగోళ్లకు టోకెన్లు జారీ..
ధాన్యం విక్రయంలో రైతులు ఇబ్బంది లేకుండా టోకెన్ విధానం ప్రవేశపెట్టారు. రైతులంతా ఒకేసారి ధాన్యం తేవడంతో మిల్లుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు బారులుదీరి ట్రాఫిక్ జామ్లతోపాటు రైతులకు వాహనాల కిరాయి అదనపు భారంగా పరిణమించనుంది. దిగుమతికి రెండు, మూడు రోజల నిరీక్షణ తప్పదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ధాన్యం విక్రయించుకోవాలనుకునే రైతులకు ముందస్తుగా టోకెన్లు జారీ చేస్తున్నారు. దీంతో రైతులు తమకు కేటాయించిన సమయం ప్రకారం ధాన్యం తీసుకువచ్చి విక్రయించే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులతోపాటు సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసే మిల్లులు ఉమ్మడి జిల్లాలో మిర్యాలగూడ పరిసర ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో నల్లగొండతోపాటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని పలు మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికే ధాన్యం తీసుకువస్తున్నారు. వారం రోజులుగా నిత్యం 2 వేలకు పైగా ట్రాక్టర్లు మిల్లుల వద్దకు వస్తున్నాయి. కానీ 1200 ట్రాక్టర్ల కంటే ఎక్కువ కొనుగోలు చేసే సామర్థ్ధ్యం లేకపోవడంతో అందుకు అనుగుణంగా అధికారులు టోకెన్లను జారీ చేస్తున్నారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, పోలీసు సిబ్బంది ఈ పనిలో తలమునకలయ్యారు. తొలుత మూడు రోజులకు టోకెన్లు జారీ చేశారు. పండగ తర్వాత మరో దఫా జారీకి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ రూం..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించేందుకు నల్లగొండ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో 9963407064 నంబర్ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. సివిల్ సైప్లె, డీఆర్డీఓ, సహాకార, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, మిల్లర్లల నుంచి ఒక్కొక్కరు చొప్పున రెండు షిప్టుల వారీగా సేవలు అందిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, గన్నీ బ్యాగుల కొరత, ఎగుమతి ఇబ్బందులు, తూకంలో కోతలు, ధాన్యం చెల్లింపులు తదితర సమస్యలపై రైతులు గానీ, కేంద్రాల ఇన్చార్జిలు నేరుగా కంట్రోల్రూంకు ఫిర్యాదు చేస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదులపై అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్కు నివేదిక అందిస్తున్నారు. మద్దతు ధర, నాణ్యాతా ప్రమాణాలు విషయాల్లో కంట్రోల్ రూం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతున్నదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో పటిష్ఠ నిఘా..
ధాన్యం కొనుగోళ్ల విషయంలో సంబంధిత శాఖలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. రైస్మిల్లుల వద్ద కొనుగోళ్లల్లో జాప్యం, తూకంలో తరుగు, మద్దతు ధర చెల్లింపుల్లో నెలకొంటున్న సమస్యలపై ప్రత్యేక నిఘాతో వ్యవహారిస్తున్నాయి. వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూనే పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సుధీర్కుమార్ రైతులకు మద్దతుగా మాట్లాడి తీసుకున్న చర్యలపై సోషల్మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వేములపల్లి ఎస్ఐ రాజు రైతులకు మద్దతుగా నిలిచారు. ఆటంకాలను అక్కడికక్కడే అధిగమించేలా పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.
మద్దతు ధర చెల్లింపులో రాజీలేదు
ధాన్యం మద్దతు ధర తగ్గించి, తూకంలో కోతలు విధిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేయాలి. రైతులకు ఇబ్బంది లేకుండా అందరూ సహకరించాల్సిందే. రైతులు కూడా నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని అమ్ముకోవాలి. అంతా ఒకేసారి ధాన్యం తెచ్చి ఇబ్బంది పడకూడదనే టోకెన్లు జారీ చేస్తున్నాం. సన్నరకం ధాన్యానికి బహిరంగ మార్కెట్లో మద్దతు ధర రాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే నిర్ణీత ప్రమాణాల మేరకు ధర లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో భారీగా ధాన్యం దిగుబడి వస్తున్నది. జనవరి వరకు కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగనుంది. రైతులు ఈ విషయాన్ని గుర్తించాలి.