పరిగి, డిసెంబర్ 1 : డిసెంబర్ 31వ తేదీ వరకు మొదటి, రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, పంచాయతీ అధికారులతో కొవిడ్ వ్యాక్సినేషన్పై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్లతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చినందున మూడవ దశ ఎదుర్కొనేలా సంసిద్దంగా ఉండాలని సూచించారు. తక్కువ వ్యాక్సినేషన్ జరిగిన ప్రాంతాలు గుర్తించి జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి పోటీ తత్వం పెంచాల్సిందిగా మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ప్రత్యేకాధికారులను నియమించాలని అన్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మొదటి, రెండో దశల ద్వారా పొందిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మూడవ దశ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడవ దశను ఎదుర్కొనడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అసత్య ప్రచారాలు నమ్మకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మీకు అందుతున్న సమాచారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
జిల్లాలో ఎన్ని బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనందున గురుకులాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల విద్యా శాఖ అధికారులకు సూచించారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మొదటి డోసు 82శాతం పూర్తి చేశామని, రెండో డోసు 20శాతం పూర్తయిందని అన్నారు. రెండో డోసుకు అర్హులైన 27,646 మందికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గురువారం నుంచి వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. జిల్లాలోని 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తక్కువ శాతం వ్యాక్సినేషన్ జరిగిందని, ఈ పీహెచ్సీలలో జిల్లా అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, ప్రత్యేకాధికారులతో కలిసి మున్సిపల్ వార్డులు, గ్రామపంచాయతీల్లో పర్యటిస్తానన్నారు. డిసెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో వంద శాతం పూర్తి చేయడానికి ప్రతిరోజు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్కు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, జిల్లా వైద్యాధికారి తుకారాం, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
షాద్నగర్టౌన్, డిసెంబర్ 1 : మున్సిపాలిటీలో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ సబితాఇంద్రారెడ్డి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ జయంత్కుమార్, అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ జయంత్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.